
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గం
ఇల్లెందు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన బానోత్ హరిప్రియ నాయక్ గెలుపొందారు. ఆమెకు 2907 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఇల్లెందు సిటింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది కోరం కనకయ్యపై ఆమె విజయం సాదించారు. గతంలో కనకయ్య కూడా కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి టిఆర్ఎస్లో చేరగా, ఈసారి కూడా హరిప్రియ కూడా కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరిపోయారు. హరిప్రియకు 70259 ఓట్లు రాగా, కోరం కనకయ్యకు 67352 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు 12900 ఓట్లు వచ్చాయి. నరసయ్య గతంలో ఐదుసార్లు ఇల్లెందులో గెలిచారు. కాని ఇప్పుడు మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
చాలాకాలం తర్వాత 2014లో ఇల్లందులో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీచేసిన కోరం కనకయ్య తన సమీప టిడిపి ప్రత్యర్ధి బాణోత్ హరిప్రియను 11507 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. కాని ఆ తర్వాత కొద్ది కాలానికే కనకయ్య అదికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 2014లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఊకే అబ్బయ్యకు 20865 ఓట్లు వచ్చాయి. 2018లో హరిప్రియ కాంగ్రెస్ ఐ పక్షాన గెలవడం విశేషం. 1972 తర్వాత ఇల్లందులో అంటే నలభై రెండు ఏళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఐ గెలవడం విశేషం.
2009లో టిడిపి పక్షాన ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఊకే అబ్బయ్యకు 2014లో టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన టిఆర్ఎస్లో చేరారు. అంతకుముందు అబ్బయ్య సిపిఐ పక్షాన రెండుసార్లు (బూర్గంపాడు, ఇల్లందు)లలో గెలిచి, తదుపరి టిడిపి పక్షాన గెలిచారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ 2014లో టిఆర్ఎస్ తరపున పినపాకలో పోటీచేసి ఓడిపోయారు. ఇల్లెందులో అత్యధికంగా సిపిఎం ఎమ్ఎల్ న్యూడెమొక్రసి నేత గుమ్మడి నరసయ్య ఐదుసార్లు గెలుపొందారు.
ఇల్లెందు నియోజకవర్గం 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. కమ్యూనిస్టు నాయకుడు కె.ఎల్. నరసింహారావు ఆ రెండుసార్లే కాక, 1962లో కూడా గెలిచారు. 1978 నుంచి రిజర్వు అయిన తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి 2014, 2018లలో గెలిచింది. కానీ గెలిచినవారు కాంగ్రెస్ను వదలి టిఆర్ఎస్లో చేరిపోయారు. ఆరుసార్లు ఇండిపెండెంట్లు గెలవడం కూడా ఒక రికార్డుగానే తీసుకోవాలి. జనరల్ నియోజక వర్గంగా ఉన్నప్పుడు ఒక కమ్మ, నాలుగుసార్లు బ్రాహ్మణ సామాజికవర్గం గెలుపొందింది. పదకుండుసార్లుగా గిరిజనులు గెలుస్తున్నారు.
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment