ప్రాజెక్ట్స్ సర్కిల్ డీఎస్ఈగా హరికృష్ణ రాజు
● గుండ్లకమ్మ–1 ఈఈగా శ్రీహరి
ఒంగోలు సబర్బన్: జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్(డీఎస్ఈ)గా వీఎస్.హరికృష్ణరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కంభం సర్కిల్ డీఈగా పనిచేస్తూ డీఎస్ఈగా పదోన్నతి పొందారు. అందులో భాగంగా ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయంలో డీఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్స్–1 ఈఈగా ఐ.శ్రీహరి కూడా ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కూడా కంభం డీఈగా పనిచేస్తూ ఈఈగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఇద్దరూ ప్రాజెక్ట్స్ ఎస్ఈ సీ.నాగమురళీ మోహన్ను కలిసి రిపోర్టు చేశారు.
పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ
కొరిటెపాడు: భారత పొగాకు బోర్డు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బి.విశ్వశ్రీ బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. బి.విశ్వశ్రీని పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, పలువురు వ్యాపారులు, రైతులు కలిసి అభినందనలు తెలిపారు.
మధుసూదన్ శాస్త్రికి
జీవిత సాఫల్య పురస్కారం
ఒంగోలు మెట్రో: జిల్లాకు చెందిన సాహితీవేత్త, కవి, విమర్శకుడు మార్కాపురం శ్రీ సాధన సాహితీ వేదిక కన్వీనర్ డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రిని 2025 ఉగాది సందర్భంగా కుర్రా కోటిసూర్యమ్మ స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులకు రెండు దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం అందిస్తున్న ఈ విశిష్ట పురస్కారానికి ఈ సంవత్సరానికి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన స్వస్థలం గుడ్లూరులో పుట్టిన డాక్టర్ మధుసూదన్ తెలుగు, సంస్కృత సాహిత్యాల్లో వందలాది విమర్శనా వ్యాసాలు, కవితలు, అంతర్జాతీయ పరిశోధన సంచికల్లో విశిష్ట వ్యాసాలు రచించారని, మార్కాపురంలో శ్రీ సాధన సాహిత్య వేదిక నెలకొల్పి అక్కడి నెలనెలా వెన్నెలను పునరుద్ధరించడం ద్వారా 60 పై చిలుకు సాహిత్య సదస్సులు నిర్వహించారన్నారు. విద్యారంగంలో 25 సంవత్సరాలు డిగ్రీ కళాశాల ఆచార్యులుగా తనదైన శైలిలో పని చేస్తూ వేలాది మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని చెప్పారు. వారి విస్తృత సేవలకు గుర్తింపుగా ఈ విశ్వావసు నామ తెలుగు ఉగాది సందర్భంగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఈనెల 29వ తేదీ శనివారం ఉదయం నిర్వహించే శ్రీకృష్ణదేవరాయ ఉగాది కవితా మహోత్సవంలో అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
27న ప్రపంచ రంగస్థల దినోత్సవం
ఒంగోలు మెట్రో: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఈనెల 27 న గురువారం సాయంత్రం ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మిడసల మల్లికార్జునరావు, కనమాల రాఘవులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొంటారని, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారన్నారు. కార్యక్రమానికి ముందుగా చందూ డ్యాన్స్ అకాడమీ చిన్నారులచే నృత్యాలు ఉంటాయని, సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భక్త చింతామణి, రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకాల్లో కొన్ని ఘట్టాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
ప్రాజెక్ట్స్ సర్కిల్ డీఎస్ఈగా హరికృష్ణ రాజు
Comments
Please login to add a commentAdd a comment