
అంతంత మాత్రంగా ఆస్తి పన్ను చెల్లింపులు
మార్కాపురం టౌన్:
గత ఆర్థిక సంవత్సరం 2023–24లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ఆస్తి పన్ను బకాయిదారులకు 100 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. దీంతో ప్రజలు సంతోషంగా ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం సుమారు వారం రోజుల క్రితం వడ్డీలో 50 శాతం మాఫీ ప్రకటించడంతో వసూళ్లు మాత్రం ఆశించిన మేర మున్సిపల్ ఖజానాకు చేరలేదు. ఉన్న ఆస్తి పన్ను డిమాండ్కు పన్నుదారులు సగం మాత్రమే బకాయిలు చెల్లించారు. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం, నీటి పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాల్టీలు/నగర పంచాయితీలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024–25 మార్చి 31వ తేదీ నాటికి ఆస్తి పన్నులు ప్రజలు సుమారు 50 శాతం మేర మాత్రమే చెల్లించారు. మార్చి నెలాఖరు నాటికి పన్నుల రూపంలో 95 శాతం ప్రజలు చెల్లించే అవకాశం ఉటుందని అధికారులు భావించినా లక్ష్యం నెరవేరలేదు.
బకాయిలు వసూళ్లలో సిబ్బంది అలసత్వం
పురపాలక సంఘాల్లో పన్నుల వసూళ్లకు గతంలో బిల్ కలెక్టర్లు ఇంటింటికీ తిరిగి డిమాండ్ నోటీసులు ఇచ్చి పన్నులు చెల్లించాలని పన్నుదారులు కోరే వారు. వారి స్థానంలో సచివాలయం సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులకు అప్పగించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడంతో కొంతమంది ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో సెలవు పెట్టి ప్రిపరేషన్కు వెళ్లారు. సిబ్బంది కొరతతో ఇస్తి పన్ను బకాయిల వసూళ్లలో ప్రజలకు ముందస్తు సరైనా అవగాహన కల్పించలేకపోయారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన పన్ను బకాయిలు చెల్లించాలని మైక్ల ద్వారా ప్రచారం చేశారు. పన్నుల చెల్లింపులో వడ్డీపై 50 శాతం తగ్గింపు ప్రభావం కూడా బాగా చూపిందని కొందరు అధికారులు పెర్కొంటున్నారు. కొన్ని పురపాలక సంఘాల్లో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసిన ఆశించిన మేర పన్నుల బకాయిలను రాబట్టలేకపోయారు.
జిల్లాలో పన్నుల విధింపు
జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు మార్కాపురం మున్సిపాలిటీ, ఐదు నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2024–25, మార్చి 31వ తేదీ నాటికి పన్నులు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,35,222 అసెస్మెంట్లు ఉండగా అందులో మొత్తం డిమాండ్ రూ.107.83 కోట్లు ఉండగా అందులో ఇప్పటికి 59.48 కోట్ల రూపాయల ఆస్తి పన్నులు ప్రజలు చెల్లించారు. ఇంకా బకాయిల రూపంలో రూ.48.36 కోట్లను పురపాలక సంఘాలకు చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా ఒంగోలు కార్పొరేషన్లో 66,069 అసెస్మెంట్లకు రూ.73.39 కోట్ల డిమాండ్ ఉండగా రూ.37.66 కోట్లు, మార్కాపురం 18,345 అసెస్మెంట్లకు రూ.11.20 కోట్లకు రూ.6.62 కోట్లు, కనిగిరి 9,991 అసెస్మెంట్లకు రూ.4.93 కోట్లకు రూ.3.31 కోట్లు, గిద్దలూరు 12,497 అసెస్మెంట్లకు రూ.4.67 కోట్లకు రూ.3.42 కోట్లు, దర్శి 9,720 అసెస్మెంట్లకు రూ.5.28 కోట్లకు రూ.3.61 కోట్లు, చీమకుర్తి 7,315 అసెస్మెంట్లకు రూ.4.73 కోట్లకు రూ.3.16 కోట్లు, పొదిలి 11,285 అసెస్మెంట్లకు రూ.3.63 కోట్లకు రూ.1.70 కోట్ల మేర పన్నులు ప్రజలు చెల్లించారు.
ప్రస్తుతం ప్రభుత్వం 50 శాతం వడ్డీ మాఫీ ప్రకటన
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 100 శాతం వడ్డీ మాఫీ
జిల్లాలో డిమాండ్ రూ.107.83 కోట్లు
చెల్లించింది మాత్రం రూ.59.48 కోట్లు
ఇంకా బకాయిలు రూ.48.36 కోట్లు
పన్ను వసూళ్ల శాతంతో మున్సిపాల్టీలు ఇలా
జిల్లాలోని వివిధ పురపాలక సంఘాల్లో పన్నుల చెల్లింపులో శాతంగా ఇలా ఉన్నాయి. పొదిలి నగర పంచాయతీ పన్నుల వసూళ్లలో 46.94 శాతంతో వెనుకబడి ఉంది. గిద్దలూరు నగర పంచాయతీ 73.37 శాతంతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మిగిలిన పురపాలక సంఘాలు దర్శి 68.28 శాతం, కనిగిరి 67.09, చీమకుర్తి 66.83, మార్కాపురం 59.13, ఒంగోలు కార్పొరేషన్ 51.31 శాతంలో ఉన్నాయి.

అంతంత మాత్రంగా ఆస్తి పన్ను చెల్లింపులు