
టీచర్స్లో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యంలోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● ఆర్వో, సిబ్బంది పనితీరుపై ఈసీకి సర్దార్ ఫిర్యాదు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. ముందు నుంచి అనుకున్నట్లుగా మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. తొలిప్రాధాన్యం ఓట్లతోనే కొమురయ్య గెలవడం విశేషం. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. అయినా కేవలం కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చానీయాంశంగా మారింది.
కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత..
సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి.
ఆర్వో, సిబ్బందిపై మండిపాటు
గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని, ఓట్లలో జంబ్లింగ్ విధానం పాటించలేదని, బూత్ల (పలిమెల బూత్) వివరాల్లో గోప్యత పాటించకుండా బయటికి వెల్లడించారని ఆరోపిస్తూ ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. వీరితోపాటు అభ్యర్థులు విక్రంరెడ్డి, సిలివేరు శ్రీకాంత్ తదితరులు ఆర్వో తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్లో పారదర్శకత లేదని, వెంటనే ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
బండి అభినందనలు
రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని కేంద్ర సహాయ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. నాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీచార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమురయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment