చోరీ కేసులో దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో దొంగ అరెస్టు

Published Sat, Feb 22 2025 7:46 AM | Last Updated on Sat, Feb 22 2025 7:46 AM

చోరీ

చోరీ కేసులో దొంగ అరెస్టు

ఆమనగల్లు: చోరీ కేసులో నేనావత్‌ చంద్రమోహన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎస్‌ఐ వెంకటేశ్‌తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆమనగల్లు పట్టణంలోని గాంధీనగర్‌ సమీపంలో గత నెల 30న తాళం వేసి ఉన్న రొయ్యల లక్ష్మమ్మ ఇంట్లో దుండగుడు చొరబడి బీరువాను పగల గొట్టాడు. అందులోని 9 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని బస్టాంట్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీ చేసినట్లు అంగీకరించాడు. అనంతరం అతడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. చోరీ కేసులో దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ వెంకటేశ్‌, కానిస్టేబుళ్లు రఘునాయక్‌, శివలను ఈ సందర్భంగా సీఐ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

కేశంపేట: విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధిలోని పడకల్‌ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్‌(28) జీటీపీఎల్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌లో ఉద్యోగి. విధుల్లో భాగంగా ఈ నెల 13న మండల పరిధిలోని పాటిగడ్డ శివారులో కమాన్‌ వద్ద విద్యుత్‌ స్తంభం ఎక్కి కేబుల్‌ వైర్లు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో షాద్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువతి అదృశ్యం

కడ్తాల్‌: ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శివ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రావిచేడ్‌ గ్రామ పంచాయతీ పరిధి మద్దెలకుంటతండాకు చెందిన నున్సావత్‌ సరళ(30).. ఆరోగ్యం బాగలేదని, కడ్తాల్‌కు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుని వస్తానని ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఆమె కోసం ఐదు రోజులుగా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. సరళ తల్లి నీలా శుక్రవారం కడ్తాల్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చోరీ కేసులో దొంగ అరెస్టు 
1
1/1

చోరీ కేసులో దొంగ అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement