చేవెళ్ల: కృతిమ అవయవాల తయారీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వయోవృద్ధులు, దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలను ఉచితంగా అందజేయనున్నట్లు చేవెళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ హెప్సిబా తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. కలెక్టర్ అదేశాలతో చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన వయోవృద్ధులకు చేతికర్రలు, వాకర్స్, వినికిడి యంత్రాలు, దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, కాలిపర్స్ కృత్రిమ కాళ్లు తదతర వాటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 4న చేవెళ్లలోని అట్లాస్ మినీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కార్యక్రమానికి వచ్చే వారు దివ్యాంగ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్కార్డు తదితర పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన వారిని గుర్తించి అవసరమైన పరికరాలు అందజేయనున్నట్టు వివరించారు.
ఈ భూమి ప్రభుత్వానికి
చెందినది
అబ్దుల్లాపూర్మెట్: మండల పరిధిలోని పిగ్లీపూర్ గ్రామం సర్వే నంబర్ 17లో గల భూదాన్, సీలింగ్ భూముల్లో శనివారం మండల రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. భూదాన్, సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఫిర్యాదులతో తహసీల్దార్ సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు సర్వేయర్ జ్యోతి, ఆర్ఐ నిజాముద్దీన్ సిబ్బందితో కలిసి సూచిక బోర్డులను నాటారు. సర్వే నంబర్ 17/2,3లలోని 116.10 ఎకరాల సీలింగ్ భూమి, 17/పార్ట్లోని 60 ఎకరాల భూదాన్ భూములకు హద్దులు ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని భూములన్నీ ప్రభుత్వానికి చెందినవని ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఆయన హెచ్చరించారు.
ఫార్మా భూ కుంభకోణంపై దర్యాప్తు చేయాలి
యాచారం: ఫార్మాసిటీ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం రైతు సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీ భూ కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామన్న కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూ కుంభకోణంలో అధికారుల పాత్ర ఉందనే ఆ శాఖ అధికారులు దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదన్నారు. ఫార్మాసిటీ పరిహారాన్ని అక్రమార్కులకు కట్టబెట్టి ఆర్డీఓ, తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, సర్వేయర్లు రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసి టీజీఐఐసీ పేరు మీద ఉన్న పట్టా భూముల రికార్డులను మళ్లీ రైతుల పేర్లపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు తావునాయక్, శ్రీశైలం, ఐలయ్య, దేవరకొండ సత్తయ్య, జంగారెడ్డి, బుగ్గరాములు, భాషయ్య పాల్గొన్నారు.
సత్తాచాటిన
గురునానక్ విద్యార్థులు
ఇబ్రహీంపట్నం: జాతీయ స్థాయి 12వ ఈవీ గోకార్ట్ డిజైన్ చాలెంజ్ పోటీల్లో గురునానక్ మెకానికల్ విద్యార్థులు సత్తా చాటారు. కోయంబత్తూరులోని కారీ మోటార్ స్పీడ్ వేలో ఐఎస్ ఈ– మోటార్ స్పోర్ట్స్ నిర్వహించిన దేశవ్యాప్త పోటీల్లో 80 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో కోయంబత్తూరులోని కుమారుగురు కాలేజ్ ఆఫ్ టెక్నా లజీ ఈజీ రేసింగ్ టీమ్ విజేతగా, గురునానక్ టీమ్ రన్నరప్గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రన్నరప్ సాధించిన విద్యార్థులను గురునానక్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ కోహ్లి, ఎండీ సైనీ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment