
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
శంకర్పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఓ బొలెరో వాహనం రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందిన సంఘటన శంకర్పల్లిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని గణేష్నగర్కి చెందిన లక్ష్మమ్మ(70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
షాద్నగర్: హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఉదయం బూర్గుల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా కాచిగూడ డెమో రైలు ఢీకొని తీవ్ర గాయల పాలయ్యాడు. గమనించిన స్థానికులు షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించగా పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా డాక్టర్ అబ్దుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు.
విద్యుత్ సరఫరాలో లైన్మెన్లు, ఆర్టిజన్లే కీలకం
సందీప్కుమార్ సుల్తానియా
సాక్షి, సిటీబ్యూరో: నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో ఆర్టిజన్లు, లైన్మెన్ల పాత్రే కీలకమని ప్రభుత్వ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా చెప్పారు. వారి పనితీరు, వ్యవహారశైలిపైనే సంస్థ అభివృద్ధి, ప్రతిష్ట ఆధార పడి ఉందన్నారు. ఈ మేరకు బుధవారం విద్యుత్ సరఫరా, సంస్థాగతంగా ఎదురవుతున్న ఇబ్బందులపై బంజారాహిల్స్ సర్కిల్ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వినియోగదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై తక్షణమే స్పందించే గుణంతో పాటు స్నేహపూర్వకంగా వ్యవహరించడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావొచ్చని సూచించారు. వేసవిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు.
డిమాండ్కు తగ్గట్టే సరఫరా
ఈ యాసంగిలో విద్యుత్ డిమాండ్ 17162 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గత వేసవితో పోలిస్తే..ఈ సారి గరిష్ట ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగే ఛాన్సు ఉందని, ఆ మేరకు సరఫరా చేసేందుకు సంస్థ సంసిద్ధంగా ఉందని తెలిపారు. గత ఏడాది గ్రేటర్లో 4352 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని తెలిపారు. ఈసారి ఏకంగా 5000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.
సిటీలో దొడ్డు బియ్యమే!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిస్తే కానీ, సన్న బియ్యం పంపిణీ జరిగే అవకాశాలు కానరావడం లేదు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. విత్డ్రాల అనంతరం ఎన్నిక ఏకగ్రీవమైతే 10వ తేదీ తర్వాత కోడ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎన్నికల బరిలో అభ్యర్థులు మిగిలి ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నెల 29 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఆ తర్వాతనే సన్నబియ్యం జరిగే అవకాశాలున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ కోటా నుంచి బియ్యం కేటగిరి మారుతుండటంతో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ ఎన్నికల కమిషన్ను అనుమతి కోరినా..ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ కొనసాగుతోంది.
దొడ్డు బియ్యంపై అనాసక్తి
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆహార భద్రత(రేషన్) లబ్ధి కుటుంబాలు దొడ్డు బియ్యంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అర్బన్ పరిధిలో సుమారు 12.56 లక్షల రేషన్ కార్డులుండగా, అందులో బుధవారం నాటికి కేవలం 20 వేల కుటుంబాలు మాత్రమే ఈ నెల కోటా డ్రా చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ నెల 17న హైదరాబాద్, 23న రంగారెడ్డి జిల్లాలో, 20న మేడ్చల్మల్కాజిగిరి అర్బన్ పరిధిలో నెల వారి కోటా గడువు ముగియనుంది.

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి