
నేడు డయల్ యువర్ డీఎం
షాద్నగర్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డీఎం ఉష శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను అందించేందుకు 90634 61297 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు.
డ్రగ్స్ తెచ్చాడు.. అడ్డంగా దొరికాడు
మొయినాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అజీజ్నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన శ్రీకాంత్ బెంగళూరు నుంచి ఎండీ ఎంఏ డ్రగ్స్ తీసుకొచ్చి బుధవారం అర్థరాత్రి మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ సమీపంలో విక్రయానికి ఉంచాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద 17.5 గ్రాముల ఎండీ ఎంఏ డ్రగ్స్ దొరికింది. అతన్ని మొయినాబాద్ పోలీస్స్టేషన్లో అప్పగించడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని శుక్రవారం రిమాండ్కు తరలించారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.2.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అధ్యక్షుడే లక్ష్యంగా..
● బీజేపీలో రచ్చకెక్కిన అంతర్గత పోరు
● మరోసారి రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర బీజేపీలో అంతర్గత పోరు చినికి చినికి గాలివానగా మారుతోంది. గత ఎన్నికల ముందు నుంచి బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భం వచ్చినపుడల్లా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలో తన నియోజకవర్గ పరిధిలో.. తనకు తెలియకుండా అధ్యక్షులను ప్రకటించడంపై తీవ్రంగా మండిపడిన రాజాసింగ్.. ఈ దఫా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావు పేరును ఖరారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఎంతో మంది పార్టీకి నమ్మకంగా పని చేస్తున్న వారు ఉండగా, మీ నియోజకవర్గంలోని వ్యక్తులకు మాత్రమే పదవులు వస్తున్నాయని, మీకు గులాంగిరీ చేసేవారికి మాత్రమే పదవులు ఇస్తారా? అంటూ ఏకంగా పార్టీ రాష్ట్రఅధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. తనకు పోటీగా శోభాయాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
లేడి.. రోడ్లపై పరుగిడి..
గచ్చిబౌలి: రోడ్లపై పరుగులు తీసిన ఓ జింక ఎట్టకేలకు ఓ ఇంట్లోకు చేరింది. పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాన్ని జూపార్క్కు చేర్చారు. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ జింక గోపన్పల్లి ఎన్టీఆర్నగర్లో రోడ్లపై పరుగులు తీయసాగింది. కుక్కలు వెంబడించడంతో వాటి బారినుంచి స్థానికులు రక్షించారు. భయంతో అక్కడే ఉన్న ఓ హార్డ్వేర్ షాపులోకి వెళ్లింది. షాపు నిర్వాహకుడు సూరజ్.. దానికి చపాతీ తిపించారు. కొద్ది నిమిషాల తర్వాత అక్కడి నుంచి జింక పరుగుతీసి బస్తీలోకి వెళ్లింది. రాణి అనే మహిళ ఇంట్లో నుంచి కమల అనే మహిళ ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్నవారు పనికి వెళ్లారు. గమనించిన స్థాని కులు బయటకు వెళ్లకుండా గేట్ మూశారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు రవి కుమార్ యాదవ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసులు జింక బయటకు రాకుండా చర్యలు చేపట్టి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ రమేష్ కుమార్, వెటర్నరీ డాక్టర్ షానవాజ్, నెహ్రూ జూలాజికల్ సిబ్బంది రెస్క్యూ వాహనంతో వచ్చారు. మొదట వల వేసి బంధించి ఇంటి నుంచి బయటకు రప్పించాలని చూడగా ప్రయత్నం ఫలించలేదు. దీంతో దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెస్క్యూ వాహనంలో జూ పార్క్కు తరలించారు.
బెదిరి.. సమూహం నుంచి చెదిరి..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకల సమూహాలు ఉన్నాయి. అవి గుంపులుగా ఒకచోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయి. నాలుగు రోజులుగా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో టీజీఐఐసీ చేపట్టిన పనుల కారణంగా జింకల సమూహాలు బెదిరి.. చెదిరిపోయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నేడు డయల్ యువర్ డీఎం