
దేశంలో 26,367 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు
రెండేళ్లలో ఐదింతలైన కేంద్రాల సంఖ్య
ఫలితంగా భారీగా పెరిగిన విద్యుత్ వాడకం
2024–25లో 847 ఎంయూల వినియోగం
12 ఏళ్లలో అమ్ముడైన ఈవీలు 59.25 లక్షలు
ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) అమ్మకాలతోపాటు.. వాటి విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. 2024–25లో రికార్డు స్థాయిలో సుమారు 19.65 లక్షల ఈవీలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈవీల కోసం ఏర్పాటుచేస్తున్న పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్) కూడా గత మూడేళ్లలో భారీగా పెరిగాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ – సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. ఈ స్టేషన్లలో చార్జింగ్ కోసం 2024–25లో వినియోగించిన విద్యుత్ 847 మిలియన్ యూనిట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 82 శాతం అధికం కావడం గమనార్హం. పీసీఎస్లు వినియోగించిన విద్యుత్ విషయంలో తెలుగు రాష్ట్రాలు టాప్ – 7 జాబితాలో ఉన్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈవీల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో (పీసీఎస్) దేశవ్యాప్త విద్యుత్ వినియోగం 2024–25లో 847.8 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. 2024 ఏప్రిల్ నెలలో వినియోగం 52.88 ఎంయూలు కాగా, 2025 మార్చిలో ఇది 60.7 శాతం పెరిగి 85 ఎంయూలకు చేరింది.
తెలంగాణ@ 5.. ఏపీ @7
కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం పీసీఎస్లు వినియోగించే విద్యుత్లో ఢిల్లీ 38.69 శాతం వాటాతో ముందంజలో ఉంది. విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, పీసీఎస్ల అధిక విద్యుత్ వినియోగానికి కారణం.. రాజధానిలో ఈవీల అమ్మకాలు దూసుకెళ్లడమే. మహారాష్ట్ర 25.57 శాతం, కర్ణాటక 9.39, గుజరాత్ 7.56 శాతాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 5వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ నిలిచాయి. టాప్ – 4 మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 18.78 శాతం విద్యుత్ను వినియోగించాయి.
ఏటా 50,000 స్టేషన్లు
భారత్లో 2025 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఈవీల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 26,367. 2022 డిసెంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నాటికే వీటి సంఖ్య సుమారు ఐదింతలు కావడం విశేషం. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో 5,880 కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,746, ఉత్తరప్రదేశ్లో 2,137, ఢిల్లీలో 1,951, తమిళనాడులో 1,524 స్టేషన్స్ పనిచేస్తున్నాయి. తెలంగాణలో 976, ఆంధ్రప్రదేశ్లో 616 స్టేషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్వే ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా చార్జింగ్ నెట్వర్క్ను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఏటా దాదాపు 50,000 చార్జింగ్ పాయింట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది.
త్రీ వీలర్ల అమ్మకాల్లో నం.1
ఈవీల అమ్మకాల్లో భారత్లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024–25లో 17 శాతం వృద్ధితో 19,64,831 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో టూ వీలర్స్ గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి 11,49,307 యూనిట్లు, త్రీ వీలర్స్ 10శాతం అధికమై 6,99,062 యూనిట్లను తాకాయి. 1,07,462 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల అమ్మకాల్లో రెండేళ్లుగా భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
చైనా గత ఏడాది 3,00,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ను విక్రయించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. 2032 నాటికి 12.3 కోట్ల ఈవీలు భారతీయ రోడ్లపై పరుగు తీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013–14 నుంచి 2025 మార్చి వరకు భారత్లో 59.25 లక్షల యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 44 లక్షలు రోడ్లపై పరుగుతీస్తున్నాయి.
2.5 నుంచి 3.5 రెట్లు
తెలంగాణలో ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ఠ విద్యుత్ వినియోగం దాదాపు 339 ఎంయూ. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సుమారు 240 ఎంయూ. అంటే తెలుగు రాష్ట్రాల ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు 2.5 నుంచి 3.5 రెట్లు ఎక్కువ విద్యుత్తును.. 2024–25లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు వినియోగించాయన్నమాట.
ఈవీలు – చార్జింగ్ స్టేషన్లు
⇒ గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు 19.65 లక్షలు
⇒2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151
⇒ 2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151
⇒ ప్రస్తుతం తెలంగాణలో 976, ఏపీలో 616 కేంద్రాల
⇒ 2013–14 నుంచి 2024–25 మధ్య అమ్ముడైనవి 59.25 లక్షల యూనిట్లు
⇒ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు