బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమివ్వండి | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యమివ్వండి

Published Sat, Feb 22 2025 7:45 AM | Last Updated on Sat, Feb 22 2025 7:45 AM

-

మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి లింగుపల్లి శంకర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎంను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2024–25 బడ్జెట్‌లో కేవలం 7శాతం నిధులు కేటాయించి తమ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ మోడల్‌ స్కూళ్లను అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించాలని అన్నారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. బడ్జెట్‌ల 15శాతం విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ డీబీఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు.

పాఠశాలల్లో కనీస వసతులు కరువు

గజ్వేల్‌రూరల్‌: బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్‌లో డీబీఎఫ్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏగొండస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని, అసద్‌ నివేదిక ప్రకారం 5.4శాతం పాఠశాలల్లో బాత్‌రూమ్‌లు లేవని, 19శాతం బడులు పాడుబడ్డాయని పేర్కొన్నారు గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు పాఠశాలల్లో పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీబీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంకు

దళిత బహుజన ఫ్రంట్‌ వినతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement