
సీసీఐ అక్రమాల్లో మరొకరు సస్పెన్షన్
హుస్నాబాద్రూరల్: పత్తి కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాల్లో హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శి ప్రభాకర్ సస్పెండ్ అయినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు శనివారం తెలిపారు. గతంలో మండల వ్యవసాయ అధికారితో పాటు జిల్లా మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయగా ఇప్పుడు హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. జిల్లాలోని 23 సీసీఐ కేంద్రాల్లో బోగస్ టీఆర్లపై పత్తి విక్రయించిన వ్యాపారులు, పత్తి మిల్లులపై చర్యలు తీసుకొనేందుకు ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. హుస్నాబాద్ సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించిన వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మహిళా శక్తి చాటాలి
వర్గల్(గజ్వేల్): వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం మహిళాదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులను ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాలలో మహిళలు పురోగమిస్తూ మహిళాశక్తి చాటాలన్నారు. మహిళలు సాధించిన విజయగాథలు స్ఫూర్తిగా విద్యార్థినులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైస్ప్రిన్సిపాల్ గోవిందరావు అన్నారు. ఏటీపీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ ముందువరుసలో ఉంటారని, అదేవిధంగా విద్యార్థినులు పురోగమించాలన్నారు. అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
ముగిసిన సదస్సు
గురుకులంలో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు శనివారం ముగిసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రసాయన శాస్త్ర సంబంధ మార్పులపై వక్తలు ప్రసంగించారు. గురుకుల ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీ. రాజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. గిరిబాబు, రిటైర్డ్ ప్రొఫెసర్ విటల్, డాక్టర్ రాధ, జానకి, విద్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment