
మెరిసిన కవలలు
తల్లి స్వీపర్.. కూతురు టాపర్
సత్తాచాటిన గురుకుల విద్యార్థినులు
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
డీఈఓ శ్రీనివాస్రెడ్డి
హుస్నాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలు అత్యుత్తమ మార్కులతో మెరిశారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన అశాడపు శ్రీనిజ, ఆశాడపు శ్రీనిత్యలు అక్కా చెల్లెల్లు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపీసీ) పూర్తి చేశారు. వెలువడిన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో శ్రీనిత్య 981/1000, శ్రీనిజ 968/1000 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలోనూ శ్రీనిత్య 461/470, శ్రీనిజ 438/470 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వారు తెలిపారు.
తొగుట(దుబ్బాక): తండ్రి లేకపోయినా.. తల్లి సహకారంతో పేదింట విద్యాకుసుమం మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని భార్గవి 971 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. పడిగె మల్లేశం, మాధవి దంపతులకు కూతురు భార్గవి, కుమారుడు స్వామి (9వ తరగతి) ఉన్నారు. వారు తమ రెక్కల కష్టంతో పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో 8నెలల క్రితం మల్లేశం గుండెపోటుతో మృత్యువాతపడ్డారు. భర్త మరణించినా గుండైధెర్యంతో ఇద్దరు పిల్లలను రెక్కల కష్టంతో చదివిస్తోంది. మాధవి గజ్వేల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నారు. తొగుటలోని బాలికల గురుకుల పాఠశాలలో చదివిన భార్గవి టెన్త్లోనూ 9.8జీపీఏ సాధించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 971 మార్కులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంది. కష్టపడి చదివి తల్లి కష్టానికి ప్రతిఫలం అందించి పేదింట సంతోషాలను పూయించింది.
సిద్దిపేటఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఎన్సాన్పల్లిలోని గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 39 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. అమూల్య, వైష్ణవిలు 468 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీ ఫస్టియర్లోనూ 37 మందికి 37 మంది ఉత్తీర్ణత కాగా, భూమిక 436 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 40 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంద్రజ, అశ్విని 990 మార్కులు వచ్చాయి. బైపీసీ సెకండియర్లో 38 మందికి 35 మంది ఉత్తీర్ణత సాధించగా దీపిక 993 మార్కులు సాధించింది. విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
జగదేవ్పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి ఏఐ ద్వారా పాఠాలు ఉంటాయని వివరించారు. విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందే విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని కోరారు. అంతకు ముందు కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, తహసీల్దార్ రఘువీరారెడ్డి, ఎంపీడీఓ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ అయూబ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
పేదింట విద్యాకుసుమం
ఇంటర్లో 971 మార్కులు సాధించిన భార్గవి

మెరిసిన కవలలు

మెరిసిన కవలలు

మెరిసిన కవలలు

మెరిసిన కవలలు

మెరిసిన కవలలు