
ఉగ్రదాడి పాశవిక చర్య
దిష్టి బొమ్మ దహనం చేసిన న్యాయవాదులు
హుస్నాబాద్: కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదులు భారత్కు రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దేశానికి రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదానందం, న్యాయవాదులు చిత్తారి రవీందర్, మురళీమోహన్, కన్నోజు రామకృష్ణ, రాజశేఖర్, సంపత్ పాల్గొన్నారు.
పేద రోగులకు సేవలందిస్తా
ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాయి దీప్తి
చేర్యాల(సిద్దిపేట):పేద రోగులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని ఇంటర్మీడియెట్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఒకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తి అన్నారు. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సాయి దీప్తిని ‘సాక్షి’ పలకరించగా పై విధంగా అన్నారు. ‘ఆ లక్ష్యంతోనే చేర్యాల కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. కష్టపడి చదివి, ఉపాధ్యాయుల సహకారంతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి పేద రోగులకు సేవలందిస్తా’నని అన్నారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కారణంగా రెండేళ్లు చదువు ఆపేసినట్లు తెలిపారు. కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో చేరి స్టేట్ ఫస్ట్ర్యాంక్ సాధించడంపై బాలికను అధ్యాపకులతో పాటు పలువురు అభినందించారు.
అదనపు సెషన్స్ జడ్జిగా ప్రసాద్
సిద్దిపేటకమాన్: ఫస్ట్ క్లాస్ అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా వైజే ప్రసాద్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
42 ఏళ్లకు కలుసుకున్న అపూర్వ మిత్రులు
ఒకరు ఏసీపీ.. మరొకరు
హెడ్మాస్టర్ హోదాలో..
మిరుదొడ్డి(దుబ్బాక): వారిద్దరు ఒకేచోట చదువుకున్న మిత్రులు. ఉన్నత చదువుల రీత్యా ఎవరికి వారు విడిపోయారు. ఒకరేమో ఏసీపీగా, మరొకరేమో హెడ్మాస్టర్గా స్థిరపడ్డారు. సరిగ్గా 42 ఏళ్ల తర్వాత ఇద్దరు విధి నిర్వహణలో అనుకోని రీతితో తారాసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఆనంద భావోధ్వేగం చూపరుల మనసును కట్టిపడేసింది. శాంతి భద్రతల సమీక్షలో భాగంగా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామాన్ని ఏసీపీ మధు బుధవారం సందర్శించారు. ఇదే గ్రామంలో జెడ్పీహెచ్ఎస్లో హెడ్మాస్టర్గా విధులను నిర్వహిస్తున్న చిన్ననాటి మిత్రుడు కూరపాటి జగన్మోహన్ రాజు ఏసీపీకి అకస్మాత్తుగా ఎదురుపడ్డారు. దీంతో సంభ్రమాశ్చర్యానికి గురై ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి విద్యనభ్యసించిన జ్ఞాపకాలను, సంఘటనలను ఒకరికొకరు గుర్తు చేసుకున్నారు.
విద్యతోనే సమాజంలో గుర్తింపు
దుబ్బాకటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తాయని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడిబాట వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు.

ఉగ్రదాడి పాశవిక చర్య

ఉగ్రదాడి పాశవిక చర్య

ఉగ్రదాడి పాశవిక చర్య