చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత జట్టు ఆడే మూడు లీగ్ మ్యాచ్లతో పాటు తొలి సెమీఫైనల్ మ్యాచ్ టికెట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం నుంచి అభిమానుల కోసం అందుబాటులో ఉంచింది. సోమవారం సాయంత్రం గం. 5:30 నుంచి టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. భారత్ తమ అన్ని మ్యాచ్లను యూఏఈలోని దుబాయ్లోనే ఆడుతుంది.
ఈ నెల 20న బంగ్లాదేశ్తో, 23న పాకిస్తాన్తో, మార్చి 2న న్యూజిలాండ్తో తమ గ్రూప్ ‘ఎ’లో తలపడుతుంది. ఈ ఫలితాల అనంతరం భారత్ ముందంజ వేస్తే తొలి సెమీఫైనల్ కూడా దుబాయ్లోనే ఆడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కోసం టికెట్లను కూడా ఐసీసీ ముందుగానే అమ్ముతోంది. టికెట్ల కనీస ధర 125 యూఏఈ దిర్హామ్లు (సుమారు రూ. 2,900)గా నిర్ణయించారు. ఇక పాక్లో జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు పీసీబీ, ఐసీసీ ఇప్పటికే విడుదల చేశాయి.
గంటలో టిక్కెట్లు హామ్ ఫట్..
ఇక వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్(India-Pakistan) మ్యాచ్కు ఉన్న క్రేజి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాదుల పోరు ఎప్పుడు జరుగుతుందా అని ఇరు దేశాల అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చాలా మంది అభిమానులు నేరుగా స్టేడియంకు వెళ్లి ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును వీక్షించాలని తహతహలడుతుంటారు.
ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్ కోసం అన్లైన్లో అమ్మకానికి ఉంచిన టిక్కెట్లు మొత్తం గంటలోనే అమ్ముడుపోయాయి. 25వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియంలో టిక్కెట్ల కోసం అన్లైన్లో సుమారు లక్షా 50 వేల మంది పోటీ పడినట్లు తెలుస్తోంది.
కాగా ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఫిబ్రవరి 15న భారత క్రికెట్ జట్టు దుబాయ్లో అడుగుపెట్టనుంది. ఈ మెగా ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్
పాక్ జట్టు:
బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, మహ్మద్ , నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది
చదవండి: ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష
Comments
Please login to add a commentAdd a comment