
2024 ఐసీసీ ‘టి20 క్రికెటర్’గా ఎంపిక
దుబాయ్: భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. గతేడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ 25 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్... 2024లో ఓవరాల్గా 18 మ్యాచ్లాడి 15.31 సగటుతో 36 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్, అమెరికా వేదికగా జరిగిన వరల్డ్కప్లో ఆరంభ ఓవర్లతో పాటు, డెత్ ఓవర్స్లో చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్న అర్ష్ దీప్ ఐసీసీ టి20 టిమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్గా నిలిచిన అర్ష్ దీప్... భారత టి20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.
టి20ల్లో ఇప్పటి వరకు 97 వికెట్లు పడగొట్టిన అర్ష్ దీప్... ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2021లో ఐసీసీ ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రవేశపెట్టింది. 2021లో మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)కు ఈ గౌరవం దక్కగా... 2022, 2023లలో సూర్యకుమార్ యాదవ్ (భారత్) గెల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment