నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్‌ తండ్రి సంచలన ఆరోపణలు | Ashwin Father Makes Stunning Claim That Forced Legend Into Retirement | Sakshi
Sakshi News home page

నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్‌ తండ్రి సంచలన ఆరోపణలు

Dec 19 2024 1:51 PM | Updated on Dec 19 2024 2:52 PM

Ashwin Father Makes Stunning Claim That Forced Legend Into Retirement

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటనపై అతని తండ్రి రవిచంద్రన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలా కాలంగా అవమానానికి గురవుతున్నాడని, అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని వివాదాస్పద కామెంట్స్‌ చేశాడు. అద్భుతమైన కెరీర్‌ రికార్డు కలిగి ఉన్నప్పటికీ ప్లేయింగ్ XIలో రెగ్యులర్‌గా స్థానం పొందలేకపోవడాన్ని యాష్‌ అవమానంగా భావించవచ్చని అభిప్రాయడపడ్డాడు.

CNN న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని ఆరోపించాడు. యాష్‌ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం అయ్యుండవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటన విన్నప్పుడు అందరి లాగే తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నాడు. 

అశ్విన్‌ రిటైర్మెంట్‌ గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని తెలిపాడు. అశ్విన్‌ మనస్సులో ఏముందో తెలియదు కానీ, అతని నిర్ణయాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తున్నానని అన్నాడు. అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన విధానం చూస్తే ఓ పక్క సంతోషం, మరో పక్క బాధగా ఉందని పేర్కొన్నాడు. 

రిటైర్మెంట్‌ అన్నది అశ్విన్‌ వ్యక్తిగతం. అందులో నేను జోక్యం చేసుకోలేను. కానీ అతని ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటన వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అవి అశ్విన్‌కి మాత్రమే తెలుసు. బహుశా తనుకు రెగ్యులర్‌గా జట్టులో చోటు దక్కకపోవడాన్ని అశ్విన్‌ అవమానంగా భావించి ఉండవచ్చని రవిచంద్రన్‌ చెప్పుకోచ్చాడు. 

కాగా, రిటైర్మెంట్‌పై అశ్విన్‌ గత కొంతకాలంగా మదన పడుతున్న విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ప్రస్తావించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ వరకు రిటైర్మెంట్‌ను పోస్ట్‌పోన్‌ చేసుకోవాలని అశ్విన్‌ను కోరినట్లు హిట్‌మ్యాన్‌ స్వయంగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ అనంతరం అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement