india vs australia
-
CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే: ఆసీస్ మాజీ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఎనిమిది జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆతిథ్య వేదికలకు చేరుకుని ఐసీసీ టోర్నమెంట్కు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇక ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్(Pakistan) దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్(Dubai)లో తమ మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు, విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియాను టైటిల్ ఫేవరెట్గా పేర్కొనగా.. పాకిస్తాన్ లెజెండరీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఈసారి కూడా భారత్- పాక్ ఫైనల్లో తలపడతాయని జోస్యం చెప్పాడు.ఇక ఓవరాల్గా మెజారిటీ మంది భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-4కు చేరతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్(Michael Clarke) సైతం ఈ ఐసీసీ ఈవెంట్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగుల, వికెట్ల వీరులు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, టోర్నీ విజేతపై తన అంచనాలు తెలియజేశాడు.టాప్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్గా వారే‘‘ఈసారి టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవబోతోంది. వాళ్ల కెప్టెన్ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు.. ఈసారి అతడే చాంపియన్స్ ట్రోఫీలో టాప్ రన్స్కోరర్ కాబోతున్నాడు. అతడు మునుపటి లయను అందుకోవడం సంతోషంగా ఉంది. టీమిండియాకు అతడి సేవలు అవసరం.ఇక ఈసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలవబోతున్నాడు. అయితే, ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై మాత్రం నేను ఎక్కువగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే, ఆర్చర్ మాత్రం ఓ సూపర్స్టార్. అందుకే అతడే ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ అని చెప్పగలను.‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా హెడ్ఇక ఈ టోర్నమెంట్లో ట్రవిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవుతాడు. ప్రస్తుతం అతడు భీకర ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో గతేడాది అదరగొట్టాడు. ఇటీవల టెస్టుల్లోనూ దుమ్ములేపాడు. అయితే, శ్రీలంక పర్యటనలో కాస్త వెనుకబడినట్లు అనిపించినా మళ్లీ త్వరలోనే బ్యాట్ ఝులిపించగలడు.అయితే, ట్రవిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చినా.. ఈసారి ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్లో ఓడిపోతుందని అనిపిస్తోంది. ఏదేమైనా హెడ్ మాత్రం హిట్టవ్వడం ఖాయం. నిజానికి అతడి బౌలింగ్ కూడా బాగుంటుంది. కానీ.. బౌలింగ్లో అతడి సేవలను ఆస్ట్రేలియా ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు’’ అని మైకేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్లో అతన అభిప్రాయాలు పంచుకున్నాడు. క్లార్క్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా.. విరాట్ కోహ్లి అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈసారి కింగ్ కోహ్లినే టాప్ రన్స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలుస్తాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పాల్గొంటున్నాయి.చదవండి: ఐపీఎల్ 2025లో SRH షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్లు ఇవే..! -
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
Rohit-Virat: నేను సిద్ధమే.. వాళ్లు రెడీగా ఉండాలి కదా!: టీమిండియా కొత్త కోచ్
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడని భారత బ్యాటింగ్ కొత్త కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) వెల్లడించాడు. అయితే, ఇంగ్లండ్తో మూడో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.కాగా ఏడాది తర్వాత.. ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా షమీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బట్లర్ బృందంతో తొలి రెండు టీ20లో మాత్రం అతడికి భారత తుదిజట్టులో చోటు దక్కలేదు.ఈ నేపథ్యంలో షమీ ఫిట్నెస్పై మరోసారి ఊహాగానాలు వచ్చాయి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్మెంట్ అతడిని పక్కనపెడుతోందని కొంతమంది భావిస్తుండగా.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీపై అదనపు భారం పడకుండా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తుది నిర్ణయం వాళ్లదేఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందిస్తూ.. షమీకి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవన్నాడు. అతడు వందశాతం మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడని అయితే తుదిజట్టులో ఆడించే అంశంపై కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.కాగా.. 2023 నవంబర్లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. కొన్నాళ్లు విశ్రాంతి, ఇంకొన్నాళ్లు గాయాలతో సతమతమైన 34 ఏళ్ల వెటరన్ బెంగాల్ సీమర్ను తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్కు ఎంపికచేశారు. దీంతో 15 నెలల తర్వాత జట్టులో చోటు దక్కింది కానీ ఆడేందుకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో కోల్కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. చెన్నై మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రాజ్కోట్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరుగుతుంది. రోహిత్, కోహ్లిలకోసం ప్రత్యేకంగా ఏమైనా..?ఇటీవలి కాలంలో టెస్టుల్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి విలేకరులు సితాన్షు కొటక్ వద్ద ప్రస్తావన తీసుకువచ్చారు. బ్యాటింగ్ కోచ్గా వారికోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రోహిత్, విరాట్ చాలా సీనియర్ ఆటగాళ్లు.అయినా.. ఈరోజుల్లో ప్రతి ఒక్క ఆటగాడు తన ఆట గురించి తానే అంచనా వేసుకోగలుగుతున్నాడు. ఇతరులతో తన ప్రణాళికల గురించి పంచుకుంటూ ..లోపాల్ని సరిచేసుకుంటున్నారు. అలాంటి వారికి మనవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలగడం గొప్ప విషయమే. సలహాలిస్తే తీసుకోవాలి కదా!నిజంగా నా సలహాల వల్ల రోహిత్, కోహ్లిల ఆట కనీసం రెండు నుంచి ఐదు శాతం మెరుగుపడినా అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయినా వాళ్లిద్దరు ఇప్పటికే ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే నా నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే.. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. తద్వారా ఎప్పటికపుడు ఆటను మెరుగుపరచుకోవచ్చు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు.కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కాగా.. విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి 31 పరుగులే చేశాడు.ఇక కోహ్లి పదకొండు ఇన్నింగ్స్ ఆడి 191 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూ జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ‘విరాహిత్’ ద్వయం వైఫల్యమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇద్దరూ రంజీ బరిలోకి వచ్చారు.చదవండి: U19 T20 WC 2025: భారత్తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
‘గంభీర్కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్కోచ్కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడి కెరీర్ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్ను హెడ్కోచ్గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
ఇలాంటి కెప్టెన్ను చూడలేదు: రోహిత్పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్గా విఫలం కావడంతో పాటు కెప్టెన్గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్రూమ్లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్తో కలిసి రివ్యూ మీటింగ్లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
టీమిండియాకు బ్యాడ్న్యూస్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతా తానై నడిపించిన బుమ్రాఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో బౌలర్గా, కెప్టెన్గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్లో.. ఫామ్లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు. 32 వికెట్లతో కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.బెడ్ రెస్ట్ అవసరం‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే. అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.అవే కీలకంఅదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్తో సిరీస్లో మాత్రం హాజిల్వుడ్ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్లో మూడో లీడింగ్ వికెట్ టేకర్గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్(Brad Hogg) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో హిట్మ్యాన్ పనైపోయిందని.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయి అన్నాడు. గత ఆరేడు నెలలుగా అతడి విఫలమవుతున్న తీరు.. కెరీర్ ముగింపునకు వచ్చిందనడానికి సంకేతం అని పేర్కొన్నాడు.అయితే, వన్డే(ODI Cricket)ల్లో మాత్రం రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా అతడికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.వరుస వైఫల్యాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో తేలిపోయిన ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. గత పదకొండు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆసీస్తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ.. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు.అయితే, తొలి టెస్టులో ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్- కేఎల్ రాహుల్ హిట్ కావడంతో.. రోహిత్ తప్పనిసరి పరిస్థితుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే, అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మూడో టెస్టులోనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. తన రెగ్యులర్ స్థానమైన ఓపెనింగ్లోనూ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విశ్రాంతి పేరిట తనంతట తానుగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్లో ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా.. తర్వాత చతికిల పడి ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.రోహిత్ ఖేల్ ఖతంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ పనైపోయిందనే అనుకుంటున్నా. ఇక అతడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిది. గత ఆరు- ఏడు నెలలుగా అతడి ఫామ్ అంత గొప్పగా ఏమీ లేదు.వికెట్ పారేసుకున్న తీరు మరీ ఘోరంఅంతేకాదు అతడు బౌల్డ్ అయ్యాడు. లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనుదిరిగాడు. ఒక ఓపెనర్ అయి ఉండి ఇలా అవుట్ కావడం సరికాదు. ముఖ్యంగా అతడు ఎల్బీడబ్ల్యూ కావడం మరీ ఘోరం’’ అని విమర్శలు గుప్పించాడు. అయితే, ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడాన్ని బ్రాడ్ హాగ్ ప్రశంసించాడు.‘‘రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడం నిరాశాజనకం. అయితే, సిడ్నీలో అతడు తీసుకున్న నిర్ణయం సరైంది. కానీ అంతకంటే ముందే.. అంటే మెల్బోర్న్ టెస్టు సందర్భంగానే అతడు తుదిజట్టు నుంచి తప్పుకొంటే ఇంకా బాగుండేది. తన స్థానంలో శుబ్మన్ గిల్కు ఆడించి ఉంటే మేలు జరిగేది’’ అని బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉందిఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ ఫార్మాట్లో కాస్త దూకుడుగా.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వయసు మీద పడుతున్న దృష్ట్యా అతడు కాస్త జాగ్రత్తగా ఆడితేనే ఇంకొన్నాళ్లు కొనసాగగలుగుతాడు.ఇప్పటి వరకు అతడి వన్డే కెరీర్ అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు రోహిత్ శర్మనే టీమిండియాకు ముందుకు నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.చదవండి: సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే! -
'ముమ్మాటికీ కోహ్లిదే తప్పు.. అతడిపై నిషేధం పడాల్సింది'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli), ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొన్స్టాస్ మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు సందర్భంగా కొన్స్టాస్ పిచ్పై నడుస్తుండగా కోహ్లి వచ్చి భుజాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దీంతో కోహ్లి తీరును చాలా మంది తప్పుబట్టారు.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా కోహ్లిపై సీరియస్ అయింది. కోహ్లి మ్యాచ్ ఫీజులో ఐసీసీ 20 శాతం కోత విధించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముమ్మాటికి కోహ్లిదే తప్పు అని, అతడు తృటిలో నిషేధం నుంచి తప్పించుకున్నాడని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. "ఆడిలైడ్లో యువ ఆటగాడు కాన్స్టాస్ పట్ల విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు సరికాదు. ఆ సమయంలో విరాట్ మితిమీరి ప్రవర్తించినట్లు అన్పించింది. అతడు చేసిన పనికి నిషేధం విధించి ఉండాల్సింది. విరాట్ కోహ్లి అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అతడు జెంటిల్మేన్ గేమ్కు ఎంతో వన్నె తెచ్చాడు. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది మీరి ప్రవర్తించకూడదు. ఇక కాన్స్టాస్ అద్బుతంగా ఆడుతున్నాడు.నిజంగా అతడి స్కూప్ షాట్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హిట్టింగ్ వరకు సరే కానీ, అతడి వద్దా డిఫెన్సివ్ టెక్నిక్ ఉందా లేదా గుర్తించాలి. టెస్టు క్రికెట్లో డిఫెన్స్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. డేవిడ్ వార్నర్ వారసుడిగా అతడు నిరూపించుకోవాలి. సామ్కు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అతడికి ఇంకా కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని టాక్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.ఆసీస్ గడ్డపై విఫలం..ఇక కోహ్లి గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో తీవ్ర నిరాశపరిచిన విరాట్.. అదే తీరును ఆస్ట్రేలియా పర్యటనలో సైతం కనబరిచాడు.తొలి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి.. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయాడు. సిరీస్ అసాంతం ఆఫ్సైడ్ బంతులను వెంటాడి తన వికెట్ను కోహ్లి కోల్పోయాడు. కోహ్లి ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన దృష్టిలో పెట్టుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: SA T20: ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ కేన్ మామ విధ్వంసం -
అతడి డిఫెన్స్ అద్భుతం.. 200 బంతులు కూడా ఆడగలడు: అశ్విన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడైన బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఫార్మాట్ ఏదైనా పంత్ బ్యాటింగ్ స్టైల్ ఒకటే. క్రీజులో వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడడం రిషబ్కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ ఢిల్లీ చిచ్చరపిడుగులో దూకుడైన బ్యాటింగ్తో పాటు అద్భుతమైన డిఫెన్స్ స్కిల్స్ను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తించాడు.ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ తన సహచరుడి బ్యాటింగ్పై ప్రశంసలు కురిపించాడు. పంత్ డిఫెన్స్ అభేద్యమని, అతను పట్టుదలగా నిలబడితే ఎన్ని బంతులైనా ఆడగలడని అశ్విన్ కొనియాడాడు.పంత్ డిఫెన్స్ అద్భుతం..‘రిషభ్ పంత్లో అన్ని రకాల షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. అయితే అతడి నుంచి మనం ఏం ఆశిస్తున్నామో అతనికి స్పష్టంగా చెప్పాలి. అతడి డిఫెన్స్ కూడా ఎంత బాగుంటుందంటే 200 బంతులు కూడా ఆడగలడు. ప్రపంచంలోనే అద్బుతంగా డిఫెన్స్ ఆడే బ్యాటర్లలో రిషబ్ ఒకడు.తన బలమేంటో తనకే పూర్తిగా తెలీదు. మిడిల్ గేమ్లో పరిస్థితికి తగినట్లుగా ఆడటం అలవాటు చేసుకుంటే ప్రతీ మ్యాచ్లో పంత్ సెంచరీ కొట్టగలడు. డిఫెన్స్ ఆడుతూ అతను అవుట్ కావడం చాలా అరుదు. నెట్స్లో నేను ఎన్నోసార్లు అతనికి బౌలింగ్ చేశాను.అతడు ఎల్బీడబ్ల్యూగా లేదా బంతి ఎడ్జ్ తీసుకుంటూ ఎప్పుడూ అవుట్ కాలేదు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి సమయంలో పంత్ ఆడుతున్నాడు. సిడ్నీలో అతడి ఆడిన ఇన్నింగ్స్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకే ఒకే గేమ్లో రెండు వేర్వేరు నాక్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో డిఫెన్స్ ఆడితే, రెండో ఇన్నింగ్స్లో తన విశ్వరూపం చూపించాడు’ అని అశ్విన్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి పంత్ మాత్రం తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులతో సూపర్ నాక్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం 9 ఇన్నింగ్స్లో పంత్.. 28.33 సగటుతో 255 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 43 టెస్టులు ఆడిన పంత్.. 42.11 సగటుతో 2948 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఆరు సెంచరీలు చేశాడు.చదవండి: క్రికెట్ ‘మనసు’ చదివింది! -
వామిక, అకాయ్లతో బృందావనంలో విరాట్- అనుష్క! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) మరోసారి ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma), పిల్లలు వామిక(Vamika), అకాయ్(Akaay)లతో కలిసి ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా కెరీర్ పరంగా కోహ్లి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ విఫలంముఖ్యంగా టెస్టుల్లో నిలకడలేమి ఆట తీరు, వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకున్నాడు కోహ్లి. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో తేలిపోయిన ఈ ‘రన్మెషీన్’.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాలోనూ చేతులెత్తేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రధాన కారణమయ్యాడు కోహ్లి. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో శతకం బాదడం మినహా.. మిగతా మ్యాచ్లలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అంతేకాదు.. ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి.. ఒకే రీతిలో వికెట్ పారేసుకున్నాడు.అంతేకాదు.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ప్రతిసారి బోల్తా పడి వికెట్ సమర్పించుకున్నాడు ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు.. ఈ పరాజయం కారణంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2025 ఫైనల్ రేసు నుంచి కూడా భారత జట్టు నిష్క్రమించింది.ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లుతదుపరి ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ మొదలుకానున్నాయి. ఆ తర్వాత వెంటనే చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టోర్నీలో తలపడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి కోహ్లి భారత్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ప్రశాంతతకై ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న ప్రేమానంద్ మహరాజ్ దర్శనం చేసుకున్నాడు. ఆ సమయంలో భార్య అనుష్కతో పాటు.. కుమార్తె వామిక, చిన్నారి కుమారుడు అకాయ్ కూడా కోహ్లి వెంట ఉన్నారు.అనుష్క వల్లే కోహ్లి ఇలాఈ సందర్భంగా అనుష్క ప్రేమానంద్ మహరాజ్తో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇక్కడికి వచ్చినపుడు నా మనసులోని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. ఈసారి ఇక్కడికి వచ్చినపుడు మాత్రం నా మనసులోని సందేహాలకు సమాధానం పొందాలని భావించాను. అయితే, ఈసారి కూడా వేరేవాళ్ల వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు’’ అని పేర్కొంది.ఇక విరుష్క దంపతులు తన ముందు ప్రణమిల్లడం చూసి భావోద్వేగానికి గురైన ప్రేమానంద్ మహరాజ్.. ‘‘మీరు చాలా ధైర్యవంతులు. ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదించిన తర్వాత కూడా దేవుడి పట్ల ఇంత అణకువగా ఉండటం అందరికీ సాధ్యం కాదు,.భక్తి మార్గంలో నడుస్తున్న అనుష్క ప్రభావమే కోహ్లి మీద కూడా ఉంటుందని మేము అనుకుంటూ ఉంటాం. విరాట్ కోహ్లి తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచుతాడు. అతడు గెలిస్తే దేశమంతా సంతోషంగా ఉంటుంది. అంతలా ప్రజలు అతడిని ప్రేమిస్తున్నారు’’ అంటూ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో వామిక, అకాయ్ల ముఖాలు కనిపించకుండా విరుష్క జోడీ జాగ్రత్తపడింది. కాగా ఈ జంట ఎక్కువగా లండన్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.చదవండి: భార్యను భర్త తదేకంగా ఎందుకు చూడొద్దు: గుత్తా జ్వాల ఫైర్Virat Kohli and Anushka Sharma with their kids visited Premanand Maharaj. ❤️- VIDEO OF THE DAY...!!! 🙏 pic.twitter.com/vn1wiD5Lfc— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2025 -
నితీశ్ రెడ్డికి వైజాగ్లో ఘన స్వాగతం.. ఓపెన్టాప్ జీపులో! వీడియో
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్టు అరంగేట్ర సిరీస్లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లో అడుగు పెట్టిన నితీశ్.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.తొలిసారి ఆసీస్ గడ్డపై అడినప్పటికి నితీశ్లో కొంచెం కూడా భయం కన్పించలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర కుర్రాడు సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని తన అంతర్జాతీయ సెంచరీని కూడా నితీశ్ అందుకున్నాడు. మెల్బోర్న్లో అతడి చేసిన సెంచరీ తన కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ బీజీటీ సిరీస్లో ఐదు టెస్టుల్లో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెడ్డి రెండో స్ధానంలో నిలిచాడు. బౌలింగ్లోనూ 5 వికెట్లతో మెరిశాడు.వైజాగ్లో గ్రాండ్ వెలకమ్..ఇక ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీష్ కుమార్ రెడ్డి తన స్వస్థలమైన విశాఖకు గురువారం చేరుకున్నాడు. విమానాశ్రయంలో ఈ తెలుగు తేజానికి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు. ఓపెన్ టాప్ జీపులో ముందు సీట్లో నితీశ్ రెడ్డి కూర్చోగా.. వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. అభిమానులతో గాజువాక వీధులు కిక్కిరిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చిత్తునితీష్ శనివారం అకాడమిలో శిక్షణకు వెళ్లనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న టీ20లు, వన్డే మ్యాచ్లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. గతేడాది ఆక్టోబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో నితీశ్ రెడ్డి డెబ్యూ చేశాడు.బంగ్లాతో సిరీస్లో కూడా అతడు అద్బుతంగా రాణించాడు. అయితే టీ20, టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఇప్పుడు వన్డేల్లో కూడా డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు 21 ఏళ్ల నితీశ్ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అతడు అక్కడ తన సత్తాచాటితే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 22న ఈడెన్ గార్డెన్స్తో జరగనున్న తొలి టీ20తో ఇంగ్లండ్ భారత పర్యటన ప్రారంభం కానుంది. ఐదు టీ20 అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ India allrounder Nitish Kumar Reddy received a grand welcome at the Vizag airport upon his homecoming after a successful tour of Australia, where he scored a maiden Test 💯 at the MCG ##BGT2025 pic.twitter.com/jt0AqTDTXK— Gaurav Gupta (@toi_gauravG) January 9, 2025 -
'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కాస్త ఘాటుగా స్పందించాడు. భారత జట్టులో "సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని, కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే భవిష్యత్తు సిరీస్లకు ఎంపిక చేయాలని బీసీసీఐకి భజ్జీ సూచించాడు.ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.బీజీటీ ఓటమి తర్వాత భజ్జీ ఏమన్నాడంటే?"ప్రస్తుతం భారత క్రికెట్లో సూపర్ స్టార్ సంస్కృతి బాగా పెరిగింది. జట్టుకు పేరు ప్రఖ్యాతుల ఉన్న వాళ్లు కాదు, బాగా ప్రదర్శన చేసేవారు కావాలి. సూపర్ స్టార్లు కంటే బాగా ఆడేవారు ఉంటేనే జట్టు విజయ పథంలో ముందుకు వెళ్తుంది. సూపర్ స్టార్ కావాలనుకునే వారు ఇంట్లోనే ఉండి క్రికెట్ ఆడాలి.మరో ఆరు నెలలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ టూర్కు ఎవరు వెళ్తారు? ఎవరికి చోటు దక్కదు? అన్న చర్చ మొదలైంది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. నావరకు అయితే బాగా ఆడే వారే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. అప్పట్లోనే కపిల్దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లనే జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు సూచించారు.కాబట్టి ఇప్పుడు కూడా బీసీసీఐ, సెలక్టర్లు అదే పనిచేయాలి. ముఖ్యంగా సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. భారత్ సూపర్స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. ఆటగాళ్లను వారి ప్రదర్శన బట్టి ఎంపిక చేయాలి"భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.విరాట్ కోహ్లి, రోహిత శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అంతలోనే తాజా పోస్ట్తో భజ్జీ మరోసారి వార్తలోకెక్కాడు. కాగా బోర్డర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. బీజీటీని భారత్ చేజార్చుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచారు.కోహ్లి ఓ సెంచరీ చేసినప్పటికి, రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్సీ, ఇటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఈ సీనియర్ ద్వయం టెస్టు క్రికెట్కు విడ్కోలు పలకాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే భారత్ తదుపరి టెస్టు పర్యటనకు మరో ఆరు నెలలు ఉంది. ఈ ఏడాది జూన్లో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. కోహ్లి, రోహిత్ టెస్టుల్లో కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 6 నెలలు ఆగక తప్పదు.చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చిత్తు -
BGT 2024-25: సిడ్నీ పిచ్పై ఆస్ట్రేలియన్ల మౌనమేల..?
భారత్లో స్పిన్కు అనుకూలించే పిచ్లపై ఆడలేక గగ్గోలు పెట్టే ఆస్ట్రేలియన్లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్లో పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై మాత్రం మౌనం వహించారు. గత ఆదివారం ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలవ్వడంతో 1-3 తేడాతో ఆసీస్కు సిరీస్ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ఓ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గళమెత్తడం అభినందనీయం. ఆస్ట్రేలియా మాజీ వికెట్కీపర్ టిమ్ పెయిన్ సిడ్నీ పిచ్ ని దుమ్మెత్తి పోయడం విశేషం."ఈ టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఏ జట్టూ 200 పరుగుల మార్కును చేరుకోలేదు. ఈ మ్యాచ్ కి ఉపయోగించిన పిచ్ ఉపరితలం బాగానే ఉంది. కానీ పగుళ్లు రావడంతో అస్థిరమైన బౌన్స్ తో బ్యాట్స్మన్ ఇబ్బంది పడ్డారు.ఈ పిచ్పై బ్యాట్స్మన్లు వ్యక్తిగత నైపుణ్యం కంటే అదృష్టంపై ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమైంది. ఈ పిచ్ కి అంతర్జాతీయ క్రికెట్ అధికారులు సంతృప్తికరమైన రేటింగ్ ఇచ్చినప్పటికీ, నేను మాత్రం దానికి సాధ్యమైనంత తక్కువ రేటింగ్ ఇస్తాను. వాళ్ళు మళ్ళీ ఇలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించేవాడ్ని.ఇలాంటి హెచ్చరిక వల్ల సిడ్నీ అధికారులు భవిష్యత్తులో ఇలాంటి పిచ్ ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. దీనివల్ల వాళ్ళు అలాంటి పిచ్ ని రూపొందించినట్టయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కనీసం భయపడతారు" అని పెయిన్ తన కాలమ్లో రాశాడు."గతంలో ఐసిసి సిడ్నీ పిచ్ కు ‘సంతృప్తికరంగా’ రేటింగ్ ఇచ్చింది. ఇది రెండో అత్యధిక రేటింగ్ . సిడ్నీ పిచ్ అరిగిపోయి స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా మారే ముందు కొద్దిగా బౌన్స్ అవుతుంది. అయితే ఈ పిచ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకు ఉత్తేజకరమైన ముగింపును అందించింది. ఇది వచ్చే సీజన్ లో జరిగే యాషెస్ సిరీస్ కి శుభసూచకమని," క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ అండ్ షెడ్యూలింగ్ హెడ్ పీటర్ రోచ్ అన్నారు.స్వదేశం లో సిరీస్ లు జరిగినప్పుడు ఆతిధ్య జట్లు పిచ్ లు తమ బౌలర్లకు అనుకూలంగా రూపాందించుకోవడం ఆనవాయితీ. అయితే విదేశీ పర్యటనలకు వచినప్పుడు మాత్రం వాళ్ళ ఆటగాళ్లు విఫలమైనప్పుడు ఆతిధ్య జట్టు పై దుమ్మెత్తి పోయడం మాత్రం సరికాదు. ఇది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు గుర్తుంచుకోవాలి! -
‘కొన్స్టాస్ పది టెస్టులు కూడా ఆడలేడు.. అతడి బలహీనత అదే!’
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్స్టాస్(Sam Konstas) భవిష్యత్తుపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిన్సన్(Steve Harminson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టీనేజర్ పట్టుమని పది టెస్టులు కూడా ఆడలేడని పేర్కొన్నాడు. కాగా డేవిడ్ వార్నర్(David Warner) రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ ఓపెనింగ్ స్థానంలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా తొలుత నాథన్ మెక్స్వీనీ వైపు మొగ్గుచూపింది.మెక్స్వీనీపై వేటు.. టీనేజర్కు పిలుపుటీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అతడిని జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఓపెనర్గా 25 ఏళ్ల మెక్స్వీనీ పూర్తిగా విఫలమయ్యాడు. పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసిన అతడు రెండు ఇన్నింగ్స్లో వరుసగా 10, 0 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో(39, 10 నాటౌట్)నూ పెద్దగా రాణించలేకపోయాడు. మూడో టెస్టులో(9, 4)నూ పూర్తిగా విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే అర్ధ శతకంఈ క్రమంలో మెక్స్వీనీపై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 19 ఏళ్ల కుర్రాడైన సామ్ కొన్స్టాస్ను భారత్తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసింది. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొన్స్టాస్.. అరంగేట్రంలోనే అర్ధ శతకం(60)తో దుమ్ములేపాడు. సిడ్నీలోనూ రాణించిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. మొత్తంగా రెండు టెస్టుల్లో కలిపి 113 పరుగులు సాధించాడు.కోహ్లి, బుమ్రాలతో గొడవఇక బ్యాట్ ఝులిపించడమే కాకుండా.. టీమిండియా సూపర్స్టార్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో గొడవ ద్వారా కూడా కొన్స్టాస్ మరింత ఫేమస్ అయ్యాడు. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న పదహారు మంది సభ్యుల ఆసీస్ జట్టులోనూ అతడు స్థానం సంపాదించాడు.డిఫెన్సివ్ టెక్నిక్ లేదుఈ నేపథ్యంలో స్టీవ్ హార్మిన్సన్ మాట్లాడుతూ.. ‘‘నాకైతే కొన్స్టాస్ కనీసం పది టెస్టులు కూడా ఆడలేడని అనిపిస్తోంది. అలా అని అతడి భవిష్యత్తుపై నేనిప్పుడే తీర్పునిచ్చేయడం లేదు. కానీ.. ఈ పిల్లాడు గనుక ఒక్కసారి లయ అందుకుంటే సూపర్స్టార్ స్థాయికి ఎదగగలడు. ఇండియాతో సిరీస్లో అతడు ర్యాంప్ షాట్లు, స్కూప్ షాట్లు ఆడాడు.కానీ.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో తలపడుతున్నపుడు వికెట్ కాపాడుకోవాల్సిన అంశంపై మాత్రం దృష్టి పెట్టలేదు. టెస్టుల్లో ఓపెనర్గా రాణించాలంటే డిఫెన్సివ్ టెక్నిక్ ముఖ్యమైనది. అయితే, కొన్స్టాస్ ఈ విషయంలో బలహీనంగా ఉన్నాడు.మరో డేవిడ్ వార్నర్ కావాలని కొన్స్టాస్ భావిస్తున్నట్లున్నాడు. అయితే, ఈ టీనేజర్కు వార్నర్కు ఉన్న టెక్నిక్లు లేవు. ఏదేమైనా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో కొన్స్టాస్ ఆడితే నాకూ సంతోషమే’’ అని పేర్కొన్నాడు. కాగా కొన్స్టాస్పై హార్మిన్సన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.ఆస్ట్రేలియాదే బోర్డర్- గావస్కర్ ట్రోఫీప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియాను 3-1తో ఓడించింది. తద్వారా దశాబ్ద కాలం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా అర్హత సాధించింది.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా మ్యాచ్ బరిలో దిగనున్న కమిన్స్ బృందం.. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: IND vs ENG: విరాట్ కోహ్లి కీలక నిర్ణయం -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్గా.. అటు కెప్టెన్గా రాణించికాగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్గా.. అటు కెప్టెన్గా రాణించి పెర్త్లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్గా, కెప్టెన్గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్తో టెస్టు సిరీస్లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్ఫార్మాట్ బెస్ట్ బౌలర్గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. వెంటనే బుమ్రాను ఆట మధ్యలోనే స్కానింగ్కు తరలించారు.ఈ క్రమంలో అతడు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళన కలిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.అతడి గాయం తీవ్రత ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, ఈ స్టార్ పేసర్ దాదాపు 5 నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లను కోల్పోవలసి ఉంటుంది.అయితే బీసీసీఐ మాత్రం బమ్రా గాయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. దీంతో బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశముంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమే అని అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా జస్ప్రీత్ భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 5 మ్యాచ్లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.టాప్లోనే బుమ్రా..ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే 907 రేటింగ్ పాయింట్లతో భారత్ నుంచి అత్యుత్తమ రేటింగ్ సాధించిన బౌలర్గా నిలిచిన బుమ్రా... ఇప్పుడు మరో పాయింట్ సాధించి 908 పాయింట్లతో నంబర్వన్గా నిలిచాడు.ఈ జాబితాలో కమిన్స్ (841) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో యశస్వి జైస్వాల్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో మెరుపు అర్ధసెంచరీ సాధించిన రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్కు చేరుకున్నాడు. టెస్టు ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో జడేజా నంబర్వన్గానే కొనసాగుతున్నాడు.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్.. -
'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక వీడ్కోలు పలికితే బెటర్'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సిరీస్లో అతడు సారథ్యం వహించిన మూడు మ్యాచ్ల్లో భారత్ రెండింట ఓటమి.. ఓ మ్యాచ్ను డ్రా ముగించింది. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. ఆఖరి టెస్టుకు పేలవ ఫామ్ కారణంగా తనంతట తనే తప్పుకున్నాడు.అయితే ఐదో టెస్టు నుంచి వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. డూ ఆర్డై మ్యాచ్లో రోహిత్ జట్టును ముందుండి నడిపించి ఉంటే బాగుండేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఆడి ఉండాల్సింది. అతడు జైశ్వాల్తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పి సిరీస్ను 2-2తో డ్రాగా ముగించి ఉంటే బాగుండేది. రోహిత్ శర్మ రెగ్యూలర్ కెప్టెన్. పరుగులు సాధించికపోయినా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతడిపై ఉంది.ఈ సిరీస్లో రోహిత్ ఒక్కడే కాదు, స్టార్ ప్లేయర్లు ఎవరూ ఫామ్లో లేరు. కోహ్లి, ఖవాజా వంటి ప్లేయర్లు కూడా తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. అయినప్పటికి వారు జట్టులో కొనసాగారు. లబుషేన్, స్మిత్లు కూడా కాస్త ఆలస్యంగా తమ ఫామ్ను తిరిగి పొందారు.ఈ సిరీస్లో ప్రతీ ఒక్క బ్యాటర్ కష్టపడ్డారు. కేఎల్ రాహుల్ ఆరంభంలో రాణించినప్పటికి, తర్వాత మాత్రం విఫలమయ్యాడు. కాబట్టి ఒక నాయకుడిగా రోహిత్ శర్మ జట్టు నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదు. ఏదైనా జట్టులో ఉండి సాధించాలి.కీలకమైన మ్యాచ్లోనే ఆడనప్పుడు, అతడు ఇక టెస్టు క్రికెట్కు దూరంగా ఉంటే బెటర్. ఐదో టెస్టులో రోహిత్ లేని లోటు కన్పించింది. బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. ఆ సమయంలో రోహిత్ ఉండి ఉంటే బాగుండేదని ప్రతీ ఒక్కరికి అన్పించింది" అని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. చదవండి: IND vs AUS: సిడ్నీ పిచ్పై ఐసీసీ రేటింగ్.. -
IND vs AUS: సిడ్నీ పిచ్పై ఐసీసీ రేటింగ్..
భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్ను ఇచ్చింది. సీమ్ బౌలింగ్కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్తో కనిపించిన ఈ పిచ్పై పేస్ బౌలర్లు చెలరేగారు. గ్రౌండ్స్మన్ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్తో ఐసీసీ కితాబునిచ్చింది.సిడ్నీలో ఘోర ఓటమి.. కాగా ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ సిరీస్తో పాటు భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు కూడా గల్లంతయ్యాయి.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ తర్వాతి మ్యాచ్ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్లో భారత్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా సిరీస్ను కోల్పోయింది.ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న వైట్బాల్ సిరీస్లకు టీమిండియా సిద్దం కానుంది.చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’ -
BCCI: గంభీర్పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..!
దశాబ్ద కాలం తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని కంగారూ జట్టుకు సమర్పించుకుంది. ఆసీస్ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ ఓడిపోయి ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. అంతేకాదు.. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాన్నీ చేజార్చుకుంది.భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియాకు ఎదురైన మూడో ఘోర పరాభవం ఇది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగగా.. గంభీర్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా కోచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు.మాయని మచ్చలుగతంలో ఏ స్థాయిలోనూ కోచ్గా పనిచేయని గంభీర్కు శిక్షకుడిగా తొలి ప్రయత్నం(టీ20 సిరీస్)లో విజయం వరించినా.. వన్డే సిరీస్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక చేతిలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వన్డే సిరీస్లో భారత్ ఓడిపోయింది. అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మునుపెన్నడూ లేని పరాభవం చవిచూసింది. స్వదేశంలో ప్రత్యర్థితో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన భారత జట్టుగా గంభీర్ మార్గదర్శనంలోని రోహిత్ సేన నిలిచింది.అనంతరం.. ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశాజనక ఫలితమే వచ్చింది. తద్వారా కోచ్గా గంభీర్ కెరీర్లో ఆరంభంలోనే ఈ మూడు మాయని మచ్చలుగా నిలిచిపోయాయి. ఆటగాళ్ల వైఫల్యం.. ముఖ్యంగా బ్యాటర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఈ మూడు సిరీస్లలో టీమిండియా ఓటమిపాలైనా.. కోచ్గా గౌతీ కూడా విమర్శలు ఎదుర్కోకతప్పదు.గంభీర్పై వేటు వేయాలంటూ డిమాండ్లు!ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ కోచ్ పదవికి సరిపోడని.. జట్టును సరైన దిశలో నడిపించే సామర్థ్యం అతడికి లేదంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. గంభీర్ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.రోహిత్- కోహ్లిల సంగతేంటి?ఇక గౌతం గంభీర్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీలేదు. తొలుత కివీస్తో టెస్టుల్లో.. అనంతరం ఆసీస్ గడ్డపై ఈ ఇద్దరూ విఫలం కావడం వల్లే ఇంతటి చేదు అనుభవాలు ఎదురయ్యాయనడంలో సందేహం లేదు. తమ ఆట తీరుతో యువకులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన విరాహిత్ ద్వయం.. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకున్న తీరు అభిమానులకు సైతం కోపం తెప్పించింది.ఈ నేపథ్యంలో గంభీర్తో పాటు.. రోహిత్, కోహ్లిలపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర అవమానం నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్, కోహ్లి భవిష్యత్తుపై మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. గంభీర్తో పాటు అతడి సహాయ సిబ్బంది అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలకు కూడా ఇప్పటికే గట్టిగానే చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాల గురించి బీసీసీఐ వర్గాలు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. IANSతో మాట్లాడుతూ.. ‘‘అవును.. రివ్యూ మీటింగ్ కచ్చితంగా ఉంటుంది.గంభీర్ కోచ్గా కొనసాగుతాడు.. ఇక రోహిత్, కోహ్లిఅయినా.. ఒక సిరీస్లో బ్యాటర్లు వైఫల్యం చెందిన కారణంగా కోచ్పై వేటు వేస్తారా?.. అలా జరగనే జరుగదు. గౌతం గంభీరే ఇక ముందు కూడా కోచ్గా కొనసాగుతాడు. అదే విధంగా విరాట్, రోహిత్ ఇంగ్లండ్తో సిరీస్లో ఆడతారు. ప్రస్తుతం టీమిండియా దృష్టి చాంపియన్స్ ట్రోఫీపైనే కేంద్రీకృతమై ఉంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీమిండియా జనవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుపెట్టనుంది. తొలుత ఇరుజట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్.. అనంతరం మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ ఐసీసీ టోర్నీ జరుగనుంది.ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇక దాయాది పాకిస్తాన్ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.చదవండి: బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మధ్యలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతడి నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.ఈ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్ వేదికగా జరిగిన పింక్-బాల్ టెస్టులో మాత్రమే భాగమయ్యాడు. ఆ మ్యాచ్లో 29 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్(మూడో టెస్టు)కు తుది జట్టు నుంచి అతడిని టీమ్మెనెజ్మెంట్ తప్పించింది.ఆ మ్యాచ్ తర్వాతే అశ్విన్ ఇంటర్ననేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. తాజాగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ సిరీస్లో ప్లేయింగ్ ఎలెవన్లో చోటుదక్కకపోవడంతోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు."టీమిండియా సరైన గేమ్ ప్లాన్తో ఆస్ట్రేలియా పర్యటనకు రాలేదు. వారు తమ మొదటి మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. సరైనా గేమ్ ప్లాన్ లేదని అప్పుడే ఆర్ధమైంది. అయితే అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కపోవడంతో అతడు నిరాశచెందినట్లు ఉన్నాడు. బహుశా అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని డిసైడ్ అయినట్లు అన్పిస్తోంది. వరల్డ్ క్రికెట్లో అశ్విన్ నంబర్ 1 స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతడి రికార్డు అత్యద్భుతంగా ఉంది. అశ్విన్ లాంటి ఆటగాళ్లు ఎవరూ కూడా బెంచ్కే పరిమితం కావాలనుకోరు. కచ్చితంగా అతడు నిరాశకు లోనై ఉంటాడు. అందుకే సిరీస్ మధ్యలోనే తన కెరీర్ను ముగించాడని" హాడిన్ విల్లో టాక్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.టెస్టు క్రికెట్లో అశ్విన్ మార్క్..అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 537, 156, 72 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా సాధించాడు. ఇందులో ఆరు శతకాలు. 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. అశ్విన్ కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడనున్నాడు.చదవండి: బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు
అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్లో 60 పరుగులతో సత్తా చాటాడు.అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్లో కొన్స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.బుమ్రాతో గొడవ పడిన కొన్స్టాస్అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కొన్స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.టైమ్ వేస్ట్ చేయాలని చూశానుఅయితే, ఆఖరి బాల్కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్స్టాస్ వైపు చూస్తూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్స్టాస్ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.నా ఆరాధ్య క్రికెటర్కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్గా పేరొందాడు.ఫైనల్కు ఆసీస్.. టీమిండియా ఇంటికిఇదిలా ఉంటే.. ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. -
'అదొక చెత్త నిర్ణయం'.. ఐసీసీపై విండీస్ గ్రేట్ ఫైర్
టెస్టు క్రికెట్కు ఆదరణను మరింత పెంచే దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అడుగులు వేస్తోంది. సంప్రదాయ ఫార్మాట్ను రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే అగ్ర శ్రేణి జట్లైనా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మరిన్ని ఎక్కువ సిరీస్లను నిర్హహించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇదే విషయంపై ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రతినిధులు, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు, ఈసీబీ చీఫ్ ఈ నెలాఖరులో సమావేశం కానున్నారని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.విండీస్ గ్రేట్ ఫైర్..కాగా టెస్టుల్లో ఈ రెండంచెల విధానం ప్రతిపాదనపై వెస్టిండీస్ గ్రేట్ క్లైవ్ లాయిడ్ మండిపడ్డాడు. "ఐసీసీ నిజంగా టెస్టుల్లో 2 టైర్ విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తుంటే, అది కచ్చితంగా భయంకరమైన నిర్ణయమవుతోంది. టెస్టు క్రికెట్ హోదా పొందేందుకు కష్టపడుతున్న చిన్న జట్ల పట్ల శాపంగా మారనుంది. ఇకపై లోయర్ డివిజన్లో మిగతా జట్లు వాళ్లతో వాళ్లే ఆడుకుంటారు. దీంతో టెస్టు క్రికెట్కు ఆదరణ పెరగడం కాదు మరింత తగ్గుతోంది. చిన్న జట్లను అగ్ర జట్లతో ఎక్కువగా ఆడేలా చేయడంపై ఐసీసీ దృష్టి సారించాలి. అంతే తప్ప ఎటువంటి చెత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని 80 ఏళ్ల క్లైవ్ లాయిడ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.వెస్టిండీస్ జట్టును రద్దు చేసి విడివిడిగా ఆడాలన్న ఐసీసీ మాజీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే సూచనపై కూడా లాయిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. " వరల్డ్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అలాంటి జట్టును విడదీయాలని మాట్లాడుతున్నారు. అది సరైన పద్దతి కాదు. వెస్టిండీస్తో సహా ఇన్ని జట్లకు సమంగా డబ్బులిస్తే సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. వారు తమ క్రికెట్ను మరింత మెరుగుపరచుకునేందుదు మెరుగైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు అని లాయిడ్ వ్యాఖ్యనించారు.చదవండి: 'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది' -
'రాహుల్ కోసం అతడిని పక్కన పెట్టేశారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది'
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న భారత జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా భారత్ ఘోరంగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా బ్యాటర్ల తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.దీంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు ఈ సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో మొత్తం ఐదు మ్యాచ్లకు సర్ఫారాజ్ బెంచ్కే పరిమితమయ్యాడు.తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫారాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. "కేఎల్ రాహుల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయం గురించి మొదటి టెస్టు సమయంలోనే మేము కామెంటేటరీ బాక్స్లో చర్చించాము. సర్ఫరాజ్కు టీమ్ మేనేజ్మెంట్ మరి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ కారణంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ స్ధాయిలో కూడా సత్తాచాటాడు. అతడు కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆసీస్ సిరీస్కు ఎంపిక చేసినప్పటికి తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. సర్ఫరాజ్కు కనీసం ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశమివ్వాల్సింది. అప్పటికీ అతడు రాణించకపోయింతే పక్కన పెట్టాల్సింది. ఇది నావరకు అయితే సరైన నిర్ణయం కాదని అన్పిస్తోంది. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ వార్మాప్ మ్యాచ్ల్లో విఫలమయ్యాడని అతడిని తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వార్మాప్ మ్యాచ్లతోనే వారి ఆటతీరును అంచనా వేయకూడదు. అతడికి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది.ఓ మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని భావించయారు. కానీ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హజారీలో భారత ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. ఆ తర్వాతి మ్యాచ్లలోనూ టాపార్డర్లోనే కొనసాగాడు.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్కు మరో షాక్ -
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి బౌలర్గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
నేను ముందే చెప్పా.. అతడిపై అంచనాలు పెట్టుకోవడం వేస్ట్: శ్రీకాంత్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ను 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ సమర్పించుకుంది. ఈ సిరీస్లో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోర్గా ఉంది. సొంతగడ్డపై బ్యాట్ ఝూలిపించే శబ్మన్.. విదేశాల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్లలో 18 ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్లలో అతడి అత్యధిక స్కోర్ కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమానర్హం.ఈ క్రమంలో గిల్పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైరయ్యాడు."శుబ్మన్ గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతునే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అతడిని ఆకాశానికెత్తేశారు. గిల్కు చాలా అవకాశాలు లభిస్తున్నాయి.పది ఛాన్స్లలో వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్లో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో అతడు జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. అంతే తప్ప స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు.భారత పిచ్లపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా తీవ్ర నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. దీంతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ చేజారిపోయింది.అయితే ఈ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన యశస్వి.. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హాజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు.మొత్తం ఐదు మ్యాచ్లలో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు సహా అతను 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ (448) తర్వాత ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. తాజాగా తన తొలి ఆస్ట్రేలియా పర్యటనపై జైశ్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.‘ఆ్రస్టేలియా గడ్డపై ఎంతో నేర్చుకున్నాను. దురదృష్టవశాత్తూ మేం ఆశించిన ఫలితం రాలేదు. అయితే మున్ముందు మరింత బలంగా పైకి లేస్తాం. మీ అందరి మద్దతు ఎంతో ప్రోత్సాహించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యశస్వి ఈ పోస్ట్ చేశాడు. కాగా జైశ్వాల్ పోస్ట్పై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా స్పందించాడు. నీ పనిని ప్రేమించు బ్రదర్ అంటూ ఖావాజా కామెంట్ చేశాడు.చదవండి: PAK vs SA: రెండో టెస్టులో పాకిస్తాన్ చిత్తు.. దక్షిణాఫ్రికాదే సిరీస్ View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
కమిన్స్ డబుల్ సెంచరీ.. చరిత్రలో తొలి ప్లేయర్
ఆస్ట్రేలియా సారధి పాట్ కమిన్స్ (Pat Cummins) ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగిన ఐదో టెస్ట్లో కమిన్స్ ఈ ఫీట్ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్ డబ్ల్యూటీసీలో కమిన్స్కు 200వ వికెట్.డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ తర్వాతి స్థానాల్లో నాథన్ లియోన్ (196 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (195), మిచెల్ స్టార్క్ (165), జస్ప్రీత్ బుమ్రా (156) ఉన్నారు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను ఆస్ట్రేలియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఓడిన ఆసీస్.. రెండు, నాలుగు, ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. తాజాగా ముగిసిన ఐదో టెస్ట్లో (సిడ్నీ) ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ సిరీస్ ఆధ్యాంతం అద్బుతంగా రాణించిన కమిన్స్ 25 వికెట్లు తీసి ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 32 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కమిన్స్ ఈ సిరీస్లో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్ల్లో 19.88 సగటున 159 పరుగులు చేశాడు.బ్యాటింగ్లో హెడ్ టాప్తాజాగా ముగిసిన బీజీటీలో ఆసీస్ చిచ్చరపిడుగు ట్రవిస్ హెడ్ అత్యధిక పరుగులు చేశాడు. ఈ సిరీస్లో 9 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన హెడ్ 56 సగటున 448 పరుగులు చేశాడు. భారత యువ కెరటం యశస్వి జైస్వాల్ 10 ఇన్నింగ్స్ల్లో 43.44 సగటున 391 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.బీజీటీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లు..ట్రవిస్ హెడ్-448యశస్వి జైస్వాల్-391స్టీవ్ స్మిత్-314నితీశ్ కుమార్ రెడ్డి-298కేఎల్ రాహుల్-276రిషబ్ పంత్-255మార్నస్ లబూషేన్-232అలెక్స్ క్యారీ-216విరాట్ కోహ్లి-190ఉస్మాన్ ఖ్వాజా-184బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు..బుమ్రా-32కమిన్స్-25బోలాండ్-21సిరాజ్-20స్టార్క్-18నాథన్ లియోన్-9జోష్ హాజిల్వుడ్-6ప్రసిద్ద్ కృష్ణ-6ఆకాశ్దీప్-5నితీశ్ కుమార్ రెడ్డి-5చెలరేగిన బోలాండ్ఐదో టెస్ట్లో ఆసీస్ స్పీడ్స్టర్ స్కాట్ బోలాండ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో బోలాండ్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన బోలాండ్, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 వికెట్ల ప్రదర్శనకు గానూ బోలాండ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బుమ్రాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది.డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్భారత్పై ఐదో టెస్ట్ గెలుపుతో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.లార్డ్స్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడతాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్లు (శ్రీలంకతో) ఆడాల్సి ఉంది. -
ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్కోచ్గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్స్టార్ ఆటిట్యూడ్ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్గా, కెప్టెన్గా రాణించిఇక ఆసీస్తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్గా, కెప్టెన్గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్తో పాటు సిరీస్లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్వాష్కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
టెస్టు క్రికెట్లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.పేలవ ప్రదర్శన.. ఇక ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు. ఎవరికీ మినహాయింపు వద్దు‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలిరంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్తో పాటు న్యూజిలాండ్పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు. ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్ల సమయంలోనే ఇంగ్లండ్తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.గంభీర్దీ అదే మాటవరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది. జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్కు ఛాన్స్! -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తమ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ ఆసీస్కు బీజీటీ టైటిల్ను అందించగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో కంగారుల కలనేరవేరింది.సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా.. 3-1 తేడాతో ఐదు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకుంది. బీజీటీతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఆసీస్ ఖారారు చేసుకుంది. కాగా ఈ సిరీస్ విజయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ది కీలక పాత్ర.సిరీస్ అసాంతం కమ్మిన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కమ్మిన్స్.. తన జట్టును వరుసగా రెండు సార్లు వరల్డ్టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు.కమ్మిన్స్ అరుదైన ఘనత..ఈ క్రమంలో ప్యాట్ కమ్మిన్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో 20 మ్యాచ్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా డబ్లూటీసీ సైకిల్స్(2021-23, 2023-25)లో కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 33 మ్యాచ్లు ఆడగా 20 గెలిచింది.కమ్మిన్స్ తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. స్టోక్స్ సారథ్యంలో 29 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ ఆడగా.. 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మూడో స్ధానంలో 14 విజయాలతో విరాట్ కోహ్లి ఉన్నాడు. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్కు ఛాన్స్! -
టీమిండియాతో ఎప్పుడూ సవాలే.. కానీ కలిసికట్టుగా పోరాడం: కమ్మిన్స్
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పదేళ్ల తర్వాత తిరిగి బీజీటీని రిటైన్ చేసుకుంది.చివరగా 2014-15లో మైఖల్ క్లార్క్ సారథ్యంలో ఆసీస్ విజేతగా నిలవగా.. మళ్లీ ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీ బీజీటీ టైటిల్ను కంగారులు దక్కించుకున్నారు. కాగా ఆఖరి మ్యాచ్లో ఆసీస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో సత్తాచాటిన కమ్మిన్స్ సేన.. బ్యాటింగ్లో కూడా దుమ్ములేపింది. భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకుంది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తిరిగి చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది. మా జట్టులో చాలా మంది ఇంతవరకు ఈ ట్రోఫీ నెగ్గలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చ లేకపోయాం. ఆ తర్వాత కలిసికట్టుగా రాణించడం బాగుంది.జట్టులోని ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన ముగ్గురు కొత్త ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో మెరుగైన ఆటతీరు కనబర్చారు. నా కెరీర్లో ఇది చాలా ఇష్టమైన ట్రోఫీ. సిరీస్ కోసం బాగా సన్నద్ధమయ్యా. భారత్ వంటి ప్రత్యర్ధితో తలపడటం ఎప్పుడూ సవాలే" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. -
ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్లను మారిస్తే బెటర్: సునీల్ గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్కు టీమిండియా సమర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ అవకాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత జట్టుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. ప్లేయర్స్తో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గంభీర్ అండ్ కో పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు."అస్సలు కోచ్లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియా సిరీస్కు సరైన ప్రణాళికలతో వెళ్లాల్సింది. కానీ కోచ్లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా బ్యాటర్ల ఆట తీరు మెరుగు పడలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్లే సమాధనమివ్వాలి. ఆటగాళ్లతో పాటు కోచ్ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో కోచ్లు ప్లాన్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్ను ఆర్డర్ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్కు బదులుగా కోచ్లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.ప్రతీ ఒక్కరూ బ్యాటర్లను మాత్రమే తప్పుబడుతున్నారు. కానీ కోచ్లను కూడా ప్రశ్నించాలన్నది నా అభిప్రాయం. ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావడం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ఫైరయ్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్లను కోల్పోయింది.చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్ చేస్తే! రిటైర్మెంట్తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్ -
ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఘోర అవమానం ఊహించిందే..!
సిడ్నీ టెస్ట్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.డబ్ల్యుటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.భారత్ ఆధిపత్యానికి తెరపడింది ఈ సిరీస్లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.అయితే స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు. భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియాఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు! -
గౌతమ్ గంభీర్పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్గా టీమిండియా తొలి సిరీస్లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్పై టెస్ట్, టీ20 సిరీస్ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్స్టర్ 39 పరుగులు చేశారు. -
కోహ్లి ఇప్పట్లో రిటైర్ కాడు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సొంత అభిమానులు సైతం కోహ్లిని ఎండగడుతున్నారు. తాజాగా ముగిసిన బీజీటీలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు మాత్రమే చేశాడు. బీజీటీ 2024-25 ద్వారా కోహ్లికి ఉన్న ఓ వీక్ పాయింట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సిరీస్లో కోహ్లి ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోలేక నానా అవస్థలు పడ్డాడు. తొమ్మిదింట ఎనిమిది ఇన్నింగ్స్ల్లో ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో రిటైర్మెంట్పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోహ్లి అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పీటీఐ నివేదిక కొట్టిపారేస్తుంది. కోహ్లికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని సదరు నివేదిక పేర్కొంది. కోహ్లి తనకు తాను లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నాడని తెలిపింది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ప్రణాళికలు సెట్ చేసుకున్నాడని పేర్కొంది.ఇదిలా ఉంటే, కోహ్లి సహా రోహిత్ శర్మను త్వరలో ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ల నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. రో-కోను ఏ ప్రాతిపదికన ఇంగ్లండ్తో పరిమత సిరీస్లకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు ప్రశిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి దేశవాలీ క్రికెట్ ఆడి ఫామ్లోకి రావాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ నిరూపించుకున్నాకే వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని గవాస్కర్ పేర్కొన్నాడు. విశ్లేషకుల అంచనా మేరకు, రోహిత్తో పోలిస్తే కోహ్లికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రోహిత్కు అవకాశాలు రాకపోవడానికి అతని ఫామ్ లేమితో పాటు వయసు కూడా ప్రధాన అంశమే. వయసులో కోహ్లి రోహిత్ కంటే సంవత్సరం చిన్నవాడు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి రోహిత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు. బీజీటీ.. అంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో కోహ్లి సెంచరీలు చేశాడు. రోహిత్ పరిస్థితి అలా లేదు. అతను ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే.. కోహ్లి కంటే ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లికి ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.కాగా, బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్స్టర్ 39 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకుంది. -
ఆటగాళ్ల భవిష్యత్తుపై నేనేమి మాట్లాడను: గౌతం గంభీర్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్(Gautam Gambhir)కు మరో ఘోర పరాభవం ఎదురైంది. అతడి నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసిన భారత జట్టు.. 10 ఏళ్ల తర్వాత బీజీటీని టైటిల్ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను సైతం భారత్ చేజార్చుకుంది. ఇక సిడ్నీ టెస్టులో ఓటమి అనంతరం భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి భవిష్యత్తులపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఆడాలా లేదా అన్నది వారి ఇష్టం, నిబద్ధతపై ఆదారపడి ఉంటుందని గౌతీ చెప్పుకొచ్చాడు."నేను ఏ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి మాట్లడాలని అనుకోవడం లేదు. అది వారి ఇష్టం. వారికి ఆటపై తపన, నిబద్ధత ఉన్నాయి. వారు భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడానికి చేయగలిగినదంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను గంభీర్ పేర్కొన్నాడు. కాగా పేలవ ఫామ్ కారణంగా ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో అతడు టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఈ టెస్టు రెండో రోజు ఆట సందర్బంగా ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని రోహిత్ స్పష్టం చేశాడు.దేశవాళీ క్రికెట్లో అందరూ ఆడాలిఅదే విధంగా దేశవాళీ క్రికెట్లో సీనియర్ ప్లేయర్లు ఆడటంపై కూడా గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ప్రతీ ఒక్క ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ఆడాలని నేను ఎప్పుడూ సూచిస్తాను. అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ రెడ్ బాల్ క్రికెట్లో తమ రాష్ట్ర జట్ల తరుపన ఆడాలి. డొమాస్టిక్ క్రికెట్లో ఆడితేనే అంతర్జాతీయ స్ధాయిలో మెరుగ్గా రాణించగలము" అని గంభీర్ వ్యాఖ్యనించాడు.ఇంగ్లండ్ సిరీస్కు కోహ్లి ఎంపిక అవుతాడా?ఇంగ్లండ్ సిరీస్కు విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న కూడా గంభీర్కు ఎదురైంది. "ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అందుకు తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. ఈ విషయం గురించి మాట్లాడానికి ఇది సరైన సమయం కాదు. క్రీడల్లో చాలా విషయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే మనం అంచనా వేయలేమని గంభీర్ బదులిచ్చాడు.చదవండి: Jasprit Bumrah: చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు -
చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు: జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది.మూడో రోజు ఆటకు స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్లో ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచందని బుమ్రా చెప్పుకొచ్చాడు."కీలక మ్యాచ్లో ఓడిపోవడం తీవ్ర నిరాశపరిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయకపోవడం కాస్త అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరానికి ప్రధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.ఈ సిరీస్లోనే బాగా బౌలింగ్కు అనుకూలించిన వికెట్పై బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పవడం బాధగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్లతో చర్చించి బయటకు వెళ్లిపోయాను. మొదటి ఇన్నింగ్స్లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము. అయినప్పటకి మిగితా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉదయం కూడా మా బౌలర్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాను. ఆఖరి ఇన్నింగ్స్లో కూడా అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏదమైనప్పటికి ఆస్ట్రేలియాకు మేము గట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకపక్షంగా సాగలేదు. మేము ఆఖరి వరకు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.గేమ్లో ఉండాలంటే ప్రత్యర్ధిపై ఒత్తిడికి గురిచేయడం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. భవిష్యత్తులో అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్తో టీమ్లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెలవలేదని నిరాశతో ఉన్నారు. కానీ ఈ ఓటమిని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడరని" పోస్ట్మ్యాచ్ ప్రెజెంటేషన్లో బుమ్రా పేర్కొన్నాడు. He was devastating at times, so it's no surprise to see Jasprit Bumrah named the NRMA Insurance Player of the Series. #AUSvIND pic.twitter.com/7qFlYcjD2d— cricket.com.au (@cricketcomau) January 5, 2025 -
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా! తొలిసారి భారత్ మిస్
టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్(WTC Final) ఆశలు ఆడియాశలు అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 2019-21 సైకిల్లో టీమిండియా 70 విన్నింగ్ శాతంతో తొట్ట తొలి సీజన్లో భారత్ ఫైనల్కు ఆర్హత సాధించింది. కానీ విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసింది.ఆ తర్వాత సైకిల్(2021-23)లో కూడా అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్కు క్వాలిఫై అయింది. కానీ డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో మాత్రం తమ ఆధిపత్యాన్ని భారత్ కొనసాగించలేకపోయింది. ఈ సీజన్లో 19 మ్యాచ్లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 50 విన్నింగ్ శాతంతో మూడో స్ధానానికే రోహిత్ సేన పరిమితమైంది.ఫైనల్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాఇక ఈ విజయంతో ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హతసాధించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో 17 మ్యాచ్లు ఆడిన ఆసీస్.. 11 విజయాలు, 4 ఓటములును నమోదు చేసింది. పాయింట్లపట్టికలో ఆస్ట్రేలియా 63.73 విన్నింగ్ శాతంతో రెండో స్ధానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ప్రోటీస్ ఆర్హత సాధించడం ఇదే తొలిసారి. ఇక జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా అమీతుమీ తెల్చుకోనున్నాయి.చదవండి: IND vs AUS: సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్ -
సిడ్నీ టెస్టులో ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి భారత్ ఔట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా(Teamindia) ఓటమితో ముగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బీజీటీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం ఇది వరుసగా రెండోసారి.ఇక మ్యాచ్లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్కు రాలేదు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది.నిప్పులు చెరిగిన బోలాండ్.. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 పరుగుల ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించిం భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా బోలాండ్ నిలిచాడు. అదే విధంగా 5 మ్యాచ్ల సిరీస్లో 32 వికెట్లు పడగొట్టి సత్తాచాటిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. -
అసలేం చేస్తున్నారు.. అది క్షమించరాని నేరం: గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ చేధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా మూడో రోజు ఫీల్డింగ్కు దిగలేదు. బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ ఎటాక్లో స్పష్టంగా కన్పించింది.తొలి రెండో ఓవర్లలోనే భారత పేసర్లు ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నారు. అందులో 12 పరుగులు ఎక్స్ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన రిథమ్ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.తొలి ఓవర్ వేసిన సిరాజ్ 13 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్ల తీరు నిరాశకు గురిచేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం తన రిథమ్ను కోల్పోయాడు. చాలా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 15 ఎక్స్ట్రాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు బౌలర్లు నో బాల్స్ను నియంత్రించగలగాలి.నో బాల్స్ వేయడం క్షమించరాని నేరం. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడూ నో బాల్స్ వేయకూడదు. కొన్ని సార్లు నో బాల్లు, వైడ్లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మన వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి వైడ్లు వేస్తున్నారు. కొంచెం లైన్ లెంగ్త్పై దృష్టి పెట్టాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: Jasprit Bumrah: 3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు.. ఆ ఒక్కడిపైనే భారం! -
India vs Aus 5th test: సిడ్నీ టెస్టులో భారత్ చిత్తు.. బీజీటీ ఆసీస్దే
IND vs Aus 5th Test Day 3 Live updates and Highlights: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో భారత్ కోల్పోయింది. అంతేకాకుండా ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి భారత్ నిష్క్రమించింది. ఇక మ్యాచ్లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రావిస్ హెడ్(34), వెబ్స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఓటమి దిశగా భారత్..సిడ్నీ టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 162 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 15 పరుగులు కావాలి.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్.. ఖావాజా ఔట్ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.15 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 81/3ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(26 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(8 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.లంచ్ బ్రేక్కు ఆసీస్ స్కోరంతంటే?లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(19 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(5 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 91 పరుగులు కావాలి.ఆసీస్ మూడో వికెట్ డౌన్..ప్రస్దిద్ద్ కృష్ణ భారత్కు మరో వికెట్ అందించాడు. 4 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్.. జైశ్వాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 65/3. లబుషేన్ ఔట్..ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జైశ్వాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 52/2. ఆసీస్ తొలి వికెట్ డౌన్సామ్ కాన్స్టాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కాన్స్టాస్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(5), మార్నస్ లబుషేన్ ఉన్నారు.భారత్కు భారీ షాక్..కాగా మూడో రోజులో ఆటలో బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్కు మాత్రం దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆలౌట్..టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకు ఆలౌటైంది. 141 పరుగుల ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.దీంతో ఆస్ట్రేలియా ముందు 161 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టగా... కమ్మిన్స్ మూడు వికెట్లు తీశాడు. ఇక భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్(61) టాప్ స్కోరర్గా నిలిచాడు.సుందర్ క్లీన్ బౌల్డ్..భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.భారత్ ఏడో వికెట్ డౌన్.. జడేజా ఔట్రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జడేజా.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 148/7మూడో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది.ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) పరుగులతో నాటౌట్గా ఉన్నారు. మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత్ బరిలోకి దిగింది. -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్లలో అక్కడి పిచ్లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు బుమ్రా, సిరాజ్లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్లు ఆడి.. ప్రతి మ్యాచ్లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్మ్యాన్ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో వైట్వాష్కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే సిరీస్ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్కే పరిమితమయ్యాడు. ఫామ్లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్మన్ గిల్కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్ను మొదటి ఇన్నింగ్స్లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్రేట్తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్రేట్తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్రేట్తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్లో టీ20ను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. భారత్ 59 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్.. ఎదురుదాడికి దిగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఢిల్లీ ఆటగాడు ఉతికారేశాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184.85 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు సాధించి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుతం టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంత్పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కష్టమైన వికెట్పై రిషబ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ కొనియాడు."సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ కఠినమైన వికెట్పై మిగితా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేటుతో ఆడితే.. పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇది నిజంగా నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచే ఆస్ట్రేలియా బౌలర్లను అతడు టార్గెట్ చేశాడు. పంత్ ఎప్పుడూ తన బ్యాటింగ్తో అందరిని అలరిస్తూ ఉంటాడు. అతడు ఇన్నింగ్స్ ఎంతో ప్రభావం చూపుతోందని" సచిన్ ఎక్స్లో రాసుకొచ్చాడు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహా యాజమాని పార్ధ్ జిందాల్ సైతం రిషబ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తుమ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అని అతడు ప్రశంసించాడు.కాగా ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన పంత్.. ఈ సారి లక్నో సూపర్ జెయింట్స్కు ఆడనున్నాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో పంత్ను సొంతం చేసుకుంది. On a wicket where majority of the batters have batted at a SR of 50 or less, @RishabhPant17's knock with a SR of 184 is truly remarkable. He has rattled Australia from ball one. It is always entertaining to watch him bat. What an impactful innings!#AUSvIND pic.twitter.com/rU3L7OL1UX— Sachin Tendulkar (@sachin_rt) January 4, 2025 Introducing to you the greatest Indian test wicketkeeper batsman in our history come on @RishabhPant17 come on India!— Parth Jindal (@ParthJindal11) January 4, 2025 -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
మొదట్లో అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్
యువ పేసర్ ప్రసిద్ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అన్నాడు. ఫామ్లో ఉన్న బౌలర్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్(Prasidh Krishna).షమీ లేకపోవడంతోకర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమైన కారణంగా ప్రసిద్కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్లతో కలిసి ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ప్రసిద్ స్థానం సంపాదించాడు. అయితే, బుమ్రా, సిరాజ్లతో పాటు హర్షిత్ రాణాకు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.ఆకాశ్ దీప్ గాయం కారణంగాఇక ఆసీస్తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా.. అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్ గాయపడటంతో ప్రసిద్ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్ మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్(33), అలెక్స్ క్యారీ(21), బ్యూ వెబ్స్టర్(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బకొట్టాడు.అనధికారిక సిరీస్లోనూ సత్తా చాటిమొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.తప్పు చేశారుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్ మొదలుకావడానికి ముందు భారత్-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని. ప్రసిద్ మంచి రిథమ్లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్మెంట్ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లొ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: పంత్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు -
అస్సలు ఏమైంది కోహ్లి నీకు..? మళ్లీ అదే బంతికి ఔట్! వీడియో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనతో ముగించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు(ఐదో టెస్టు)లోనూ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరును కనబరిచాడు.కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కింగ్ కోహ్లి మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి దొరికిపోయాడు. విరాట్ కోహ్లి వీక్నెస్ను బోలాండ్ మళ్లీ క్యాష్ చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బోలాండ్ తొలి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి సంధించాడు.ఆ బంతిని హార్డ్ హ్యాండ్స్తో కోహ్లి డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో సెకెండ్ స్లిప్లో ఉన్న స్టీవ్ స్మిత్ ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ సిరీస్లో కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. కాగా ఒకప్పుడు ఆఫ్ సైడ్ బంతులను అద్భుతంగా ఆడే కోహ్లి.. ఇప్పుడే అదే బంతులకు తన వికెట్ను కోల్పోతుండడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఏమైంది కోహ్లి నీకు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్న విరాట్.. ఈసారి మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులు చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్ల్లోనూ తీవ్ర నిరాశపరిచాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఆగ్రహంThe Scott Boland show is delivering at the SCG!He's got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j— cricket.com.au (@cricketcomau) January 4, 2025 -
పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల దూకుడుకు పంత్ కళ్లేం వేశాడు.తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచిన పంత్.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానుల అలరించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఈ ఢిల్లీ డైనమెట్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్నే తొలి స్ధానంలో ఉన్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో పంత్ కేవలం 28 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్గా రికార్డు..ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్గా రిషబ్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నారు. తాజా మ్యాచ్తో ఈ దిగ్గజాల ఆల్టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆలౌటైంది. Aate hi RISHABH-PANTI shuru! 🔥When @RishabhPant17 steps in, the entertainment level goes 𝗨𝗽&𝗨𝗽 📈#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/tiJiuBOEDO— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్లో ఇప్పటికి రెండు మ్యాచ్లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది. గెలిస్తేనే కనీసం డ్రాఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.ఈ నేపథ్యంలో పెర్త్లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22), శుబ్మన్ గిల్(20) రాణించారు.బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్ బ్యాటర్ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు. ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్స్టాస్ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.అనంతరం బౌలింగ్ చేసిన బుమ్రా ఖవాజా వికెట్ తీసి .. కొన్స్టాస్తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.ఈ ఘటనపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్స్టాస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.పిచ్చి పనులు మానుకోండిఅనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్ తీయడం సంతోషకరం’’ అని రోహిత్ శర్మ తమ జట్టును అభినందించాడు. చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. 46 ఏళ్ల రికార్డు బద్దలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన అద్బుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులోనూ బుమ్రా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ను మరోసారి దెబ్బతీశాడు.అయితే గాయం కారణంగా బుమ్రా మొదటి ఇన్నింగ్స్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తొడ కండరాల పట్టేయడంతో ఆట మధ్యలోనే బుమ్రా మైదానాన్ని వీడాడు. కాగా ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.46 ఏళ్ల రికార్డు బద్దలు..ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బుమ్రా ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది.1977/78 సీజన్లో ఆసీస్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో బేడీ 46 ఏళ్ల ఆల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా
సిడ్నీ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అంతేకాకుండా ప్రాక్టీస్ జెర్సీ ధరించి స్కానింగ్ కోసం సిబ్బందితో కలిసి స్కానింగ్ కోసం ఆస్పత్రికి జస్ప్రీత్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో భారత అభిమానుల ఆందోళన నెలకొంది.ఒకవేళ స్కానింగ్ రిపోర్ట్లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే భారత్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడి గైర్హజరీలో విరాట్ కోహ్లి స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ వికెట్ పడగొట్టి భారత్కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.ఆసీస్ 181కు ఆలౌట్..ఇక సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్స్టర్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్స్టాస్(23) పరుగులతో రాణించారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫామ్ లేమి కారణంగా రోహిత్ తనంతటతానే తప్పుకున్నాడని స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ సమయంలో చెప్పుకొచ్చాడు.అయినప్పటికి జట్టు మెనెజ్మెంట్ కావాలనే రోహిత్పై వేటు వేసిందని, సిడ్నీ టెస్టు తర్వాత అతడు రెడ్ బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. స్వచ్ఛందంగా తనంతట తనే తప్పుకున్నాని రెండో రోజు లంచ్ సమయంలో బ్రాడ్క్రాస్టర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పుకొచ్చాడు.బ్రాడ్ కాస్టర్లు: రోహిత్ మీరు సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీరు విశ్రాంతి తీసుకున్నారని కొన్ని రిపోర్టులు చెబుతుండగా.. మరి కొన్ని నివేదికలు మిమ్మల్ని జట్టు నుంచి తప్పించారని పేర్కొంటున్నాయి. ఇందులో ఏది నిజం?రోహిత్ శర్మ: నన్ను జట్టు నుంచి తప్పించారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా నా సొంత నిర్ణయమే. ప్రస్తుతం నేను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. నేను ఫామ్లో కూడా లేను. ఫామ్లో లేని ఆటగాళ్లు జట్టుకు భారం కాకుడదు. సిడ్నీ టెస్టు మాకు చాలా కీలకం. కాబట్టి ఇన్ ఫామ్ బ్యాటర్కు అవకాశమివ్వాలనుకున్నాను.ఇదే విషయం కోచ్, చీఫ్ సెలెక్టర్తో చర్చించాను. ఆ తర్వాతే జట్టును ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. అదే విధంగా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలపై కూడా హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు."ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నంత మాత్రాన నేను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు కాదు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన నా మనసులో లేదు. ప్రస్తుతం పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్నా. అంతమాత్రాన ఎప్పటికి ఇదే ఫామ్ కొనసాగదు కాదా? తిరిగి కమ్బ్యాక్ ఇస్తాన్న నమ్మకం నాకు ఉంది .అంతే తప్ప ఎవరో బయట కూర్చోని నా రిటైర్మెంట్ను డిసైడ్ చేయలేరు. నేను ఇద్దరి పిల్లల తండ్రిని, స్వంతంగా నా నిర్ఱయాలు తీసుకోగలను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు. -
India vs Aus 5th test: ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్లో భారత్
India vs Aus 5th test day 2 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్లో భారత్సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) నాటౌట్గా ఉన్నారు.అంతకుముందు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, వెబ్స్టర్ తలా వికెట్ సాధించారు. కాగా ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియానితీశ్ రెడ్డి(21 బంతుల్లో 4) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. జడేజా రెండు పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 129/6 (27.4). ఆసీస్ కంటే 133 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.రిషబ్ పంత్ ఔట్..రిషబ్ పంత్ ధనధాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు భారత్ స్కోర్ 125-5. క్రీజులో జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ప్రస్తుతం 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. పంత్ 61 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 124/2. టీమిండియా ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.దూకుడుగా ఆడుతున్న పంత్..టీమిండియా వరుస క్రమంలో వికెట్లు పడతున్నప్పటికి రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 97/4. భారత్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత్ నాలుగో వికెట్ డౌన్..శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్..వెబ్స్టర్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి కోహ్లి ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్ 68/3. క్రీజులో గిల్(13), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాబోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ను బౌల్డ్ చేసిన ఈ పేస్ బౌలర్.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(22)ను కూడా పెవిలియన్కు పంపాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 47/2 (9.5). గిల్ ఐదు పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో బౌల్డ్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టీమిండియా స్కోరు: 42/1 (7.3). శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 22 పరుగులతో ఉన్నాడు.ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 36/0 (6)జైస్వాల్ 21, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.జైశ్వాల్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో 16 పరుగులుభారత్ తమ రెండో ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.181 పరుగులకు ఆసీస్ ఆలౌట్..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ తమ తొన్నింగ్స్లో 181 పరుగులకు కుప్పకూలింది. 9/1 ఓవర్ నైట్స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అదనంగా 172 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది.భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్స్టర్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్స్టాస్(23) పరుగులతో రాణించారు.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్.. వెబ్స్టర్ ఔట్ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన వెబ్స్టర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో జైశ్వాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 48 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 170/9ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన స్టార్క్.. నితీశ్కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆసీస్ ఏడో వికెట్ డౌన్..ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కమ్మిన్స్.. నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. 46 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 163/7. ప్రస్తుతం క్రీజులో వెబ్స్టర్(56 నాటౌట్), స్టార్క్(1) ఉన్నారు.ఆరో వికెట్ డౌన్.. క్యారీ ఔట్ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న వెబ్స్టర్, క్యారీ..లంచ్ బ్రేక్ అనంతరం వెబ్స్టర్, క్యారీ నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్లు ముగిసే 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వెబ్స్టర్(37), క్యారీ(5) ఉన్నారు.లంచ్ బ్రేక్కు ఆసీస్ స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో వెబ్స్టర్(28), క్యారీ(4) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన స్మిత్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.సిరాజ్ ఆన్ ఫైర్..మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ను దెబ్బ తీశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి సామ్ కాన్స్టాస్ను ఔట్ చేయగా.. ఐదో బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్కు పంపాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/4. క్రీజులో వెబ్స్టర్(0), స్మిత్(4) ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్కు బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన లబుషేన్.. బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 25/2. క్రీజులో సామ్ కాన్స్టాస్(18), స్మిత్(4) ఉన్నారు.రెండో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆసీస్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. -
తీరు మార్చుకోని కోహ్లికి రిటైర్మెంట్ తప్పదా..?
భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది. -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
టీమిండియాతో ఐదో టెస్ట్.. స్కాట్ బోలాండ్ రికార్డు
సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్ట్లో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఓ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టిన బోలాండ్ టెస్ట్ల్లో 50 వికెట్ల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో అతి పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. బోలాండ్ 35 ఏళ్ల 267 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. న్యూజిలాండ్కు చెందిన బెవాన్ కాంగ్డాన్ 37 ఏళ్ల 10 రోజుల వయసులో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ 50వ టెస్ట్ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో బోలాండ్ జోష్ హాజిల్వుడ్కు ప్రత్యామ్నాయంగా వచ్చాడు. ఈ సిరీస్లో బోలాండ్ ఐదు ఇన్నింగ్స్ల్లో 15.46 సగటున 15 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ టెస్ట్లో బోలాండ్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బీజీటీలో బోలాండ్ ఐదో లీడింగ్ వికెట్టేకర్గా ఉన్నాడు. బోలాండ్ తన టెస్ట్ కెరీర్లో 13 మ్యాచ్లు ఆడి 50 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.సిడ్నీ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. బోలాండ్ 4, మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లియోన్ ఓ వికెట్ తీసి టీమిండియా భరతం పట్టారు. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్గా నిలువగా.. రవీంద్ర జడేజా 26, జస్ప్రీత్ బుమ్రా 22, శుభ్మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 17, వాషింగ్టన్ సుందర్ 14, యశస్వి జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, నితీశ్కుమార్ రెడ్డి 0, ప్రసిద్ద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు ప్రదర్శన ఇవ్వడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (2) తొలి రోజు ఆటలో చివరి బంతికి ఔటయ్యాడు. సామ్ కొన్స్టాస్ (7) క్రీజ్లో ఉన్నాడు. ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది. -
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?
సిడ్నీ టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించడం పట్ల భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథినే పక్కనపెట్టడం ద్వారా మేనేజ్మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరుగలేదంటూ బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో కంగారూ జట్టుతో తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత జట్టును ముందుండి నడిపించిన బుమ్రా.. పెర్త్ టెస్టులో విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత అయితే, రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ తిరిగి వచ్చిన తర్వాత టీమిండియా వరుసగా వైఫల్యాలే ఎదురయ్యాయి. అడిలైడ్లో ఓడిపోయిన భారత్.. బ్రిస్బేన్లో డ్రా చేసుకున్నా.. మెల్బోర్న్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా సిరీస్లో 1-2తో వెనుకబడింది.బ్యాటర్గానూ విఫలంఇక బ్యాటర్గానూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. ముఖ్యంగా అనవసరపు షాట్లకు పోయి అతడు వికెట్ పారేసుకున్న తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట రోహిత్ స్వయంగా తప్పుకొన్నాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ వంటి వాళ్లు రోహిత్ నిర్ణయాన్ని సమర్థించగా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం భిన్నంగా స్పందించాడు.తప్పుడు నిర్ణయం.. రోహిత్నే పక్కన పెడతారా?‘‘ఇది చాలా ఆశ్చర్యకరంగా, వింతగా ఉంది. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అతడిని కెప్టెన్ను ఎందుకు చేశారు?.. అయినా సారథిగానే కాకుండా కీలక ఆటగాడిగా భారత క్రికెట్కు అతడు ఇప్పటికే ఎంతో సేవ చేశాడు.అలాంటి ఆటగాడి ఫామ్ బాగున్నా.. లేకున్నా అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అతడు కెప్టెన్. జట్టు ప్రయోజనాల కోసం తనను తాను బెంచ్కే పరిమితం చేసుకోవడం ఏమిటి? ఇలా చేయడం ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ తప్పుడు సంకేతాలు ఇస్తోంది.అతడిపై వేటు వేయడమో.. లేదంటే తనకు తానుగా తప్పుకొనేలా చేయడమో సరికాదు. జట్టును నిర్మించిన సారథి అతడు. యువ ఆటగాళ్లలో చాలా మంది అతడిని తమ తండ్రి సమానుడిలా భావిస్తారు. వాళ్ల నుంచి అతడు అంతటి గౌరవాన్ని పొందాడు. ఏ కెప్టెన్ అయినా నౌకను మధ్యలోనే వీడి వెళ్లిపోడు. అది మునిగిపోతుందని తెలిసినా గట్టెక్కించే ప్రయత్నమే చేస్తాడు గానీ.. తానే ముంచేయాలని చూడడు. అతడొక గౌరవప్రదమైన వ్యక్తి. కానీ మీరు మాత్రం అతడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ పట్ల గౌరవంగా వ్యవహరించాల్సింది. అతడిపై నమ్మకం ఉంచాల్సింది’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సిడ్నీలో తొలి రోజు ముగిసిందిలాకాగా ఆసీస్తో సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు ఆదిలోనే షాకిచ్చింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి ఆసీస్ తొమ్మిది పరుగులు చేసింది.చదవండి: కొన్స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
కొన్స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్లో ఓడిపోయి.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్గా, కెప్టెన్గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కొన్స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఖవాజా ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్స్టాస్కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్స్టాస్కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్స్టాస్కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్ను దెబ్బతీసేలా వికెట్తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
రిషబ్ పంత్ సూపర్ సిక్సర్... నిచ్చెనెక్కి బంతిని తీశారు! వీడియో
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22) రాణించారు.భారత బౌలర్లలో ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆసీస్కు తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఆసీస్ స్టార్ ప్లేయర్ ఉస్మాన్ ఖావాజాను బుమ్రా పెవిలియన్కు పంపాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.పంత్ భారీ సిక్సర్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్(Rishabh Pant) విరోచిత పోరాటం కనబరిచాడు. విరాట్ కోహ్లి ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ల నుంచి బంతులు బుల్లెట్లా తన శరీరానికి తాకుతున్నప్పటకి పంత్ మాత్రం తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు.ఈ క్రమంలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్స్టర్ బౌలింగ్లో రిషబ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. అతడు కొట్టిన షాట్ పవర్ బంతి ఏకంగా సైడ్స్క్రీన్పై చిక్కుకుపోయింది. దీంతో ఆ బంతిని తీసేందుకు గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు. నిచ్చెనను తీసుకువచ్చి మరి ఆ బంతిని కిందకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: స్మిత్, లబుషేన్ మైండ్గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే.. A six so big the ground staff needed a ladder to retrieve it!#AUSvIND pic.twitter.com/oLUSw196l3— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
స్మిత్, లబుషేన్ మైండ్గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపట్టాడు. అలా శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
'రోహిత్ నిజంగా చాలా గొప్ప కెప్టెన్.. అది అతడి సొంత నిర్ణయమే'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు రోహిత్ తనంతటతానే దూరంగా ఉండాలని నిర్ణయించకున్నాడని టాస్ సమయంలో స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.రోహిత్ స్దానంలో తుది జట్టులోకి శుబ్మన్ గిల్(Shubman gill) వచ్చాడు. రోహిత్ గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో నిరాశపరిచిన హిట్మ్యాన్.. ఆస్ట్రేలియా గడ్డపై అదే తీరును కనబరుస్తున్నాడు.ఈ సిరీస్లో రోహిత్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ వైదగొలగాలని నిర్ణయించుకున్నాడు. వైదొలగాలని రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు"పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ స్వచ్చందంగా తానుకు తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హెడ్కోచ్ గౌతం గంభీర్తో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు.ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయమే అనిపిస్తుంది. ఒక కెప్టెన్గా రోహిత్ తీసుకున్న నిజంగా ప్రశంసనీయం. రోహిత్ భవిష్యత్తు కెప్టెన్లకు రోల్మోడల్గా నిలుస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
IND Vs AUS: పంత్ మోచేతికి గాయం.. అయినా సరే! వీడియో వైరల్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh pant) అద్బుతమైన పోరాటం కనబరిచాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లతో ముప్పుతిప్పులు పెడుతున్నప్పటికీ.. పంత్ మాత్రం తన విరోచిత ఇన్నింగ్స్ను కొనసాగించాడు.ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దెబ్బకు మోచేతిపై కాస్త వాపు వచ్చింది. వెంటనే ఫిజియోలు వచ్చి అతడికి చికిత్స అందించారు. నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలర్లను రిషబ్ చాలాసేపు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.ఈ ఒక్కటే కాకుండా తర్వాత చాలా బంతులు పంత్ శరీరానికి బలంగా తాకాయి. అయినప్పటకి రిషబ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 40 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఐదో వికెట్గా వెనుదిరిగాడు.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ Rishabh Pant facing some serious punishment from the Australian bowlers. Taking some heavy blows. #AUSvIND #Rishabpant #BorderGavaskarTrophy #ToughestRivalry https://t.co/QiLSnpRbYE— 𝕊𝕙𝕒𝕙𝕚𝕕 𝕌𝕝 𝕀𝕤𝕝𝕒𝕞 (@Shahid_shaban) January 3, 2025 -
మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు.మరోసారి కోహ్లి వీక్నెస్ను ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ సొమ్ము చేసుకున్నాడు. 31 ఓవర్లో బోలాండ్ వేసిన ఆఫ్సైడ్ బంతిని వెంటాడి మరి తన వికెట్ను కోహ్లి కోల్పోయాడు. ఆ ఓవర్లో మూడో బంతిని బోలాండ్.. విరాట్కు ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో థర్డ్ స్లిప్లో ఉన్న ఆసీస్ అరంగేట్ర ఆటగాడు వెబ్స్టర్ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. దీంతో చేసేదేమి లేక కోహ్లి(17) నిరాశతో మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్లో కోహ్లి ఆఫ్సైడ్ బంతులకు కోహ్లి ఔట్ కావడం ఇది ఏడో సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 43 ఓవర్లు ముగిసే భారత్ 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. Virat Kohli wicket. 😞#INDvsAUS #AUSvIND #ViratKohli pic.twitter.com/mqCMNWMdA3— Tanveer (@tanveermamdani) January 3, 2025 -
రోహిత్ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే?
అంతా ఊహించిందే జరిగింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) దూరమయ్యాడు. అతడి స్దానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతోన్న రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు."ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ తనంతటతానే విశ్రాంతి తీసుకుని తన గొప్పతానాన్ని చాటుకున్నాడు. ఈ పరిణామం జట్టులో చాలా ఐక్యత ఉందని చూపిస్తుంది. టీమిండియాలో స్వార్దం అనే పదానికి తావు లేదు. అందరూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.రోహిత్ విశ్రాంతి తీసుకోగా, ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమయ్యాడు. రోహిత్ స్ధానంలో గిల్ జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడని" బుమ్రా పేర్కొన్నాడు. కాగా సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడనే వార్తలు ముందు నుంచే వినిపించాయి.దానికితోడు రోహిత్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించకపోవడం, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్ బుమ్రాతో సుదీర్ఘమైన చర్చలు జరపడంతో హిట్మ్యాన్ బెంచ్కే పరిమితం కానున్నడన్న విషయం అర్దం అయిపోయింది. అంతా అనుకున్నట్లే ఆఖరి టెస్టుకు ఈ ముంబైకర్ దూరమయ్యాడు.కాగా ఈ సిరీస్లో రోహిత్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. తన ట్రేడ్మార్క్ ఫ్రంట్ పుల్ షాట్ ఆడటంలో కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్చదవండి:లంక పర్యటనకు కమిన్స్ దూరం -
బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్.. వికెట్తో తొలిరోజు ముగించిన భారత్
India vs Aus 5th test day 1 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్(20), రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించగా.. రిషభ్ పంత్(40), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(17 బంతుల్లో 22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వికెట్ తీసిన బుమ్రాఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(2)ను సింగిల్ డిజిట్కే పరిమితం చేశాడు. సిడ్నీలో శుక్రవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆసీస్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. సామ్ కొన్స్టాస్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.185 పరుగులకు టీమిండియా ఆలౌట్..సిడ్నీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరి కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు జడేజా(26) పర్వాలేదన్పించాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మిచెల్ స్టార్క్ మూడు, కమ్మిన్స్ రెండు, లియోన్ ఒక్క వికెట్ సాధించారు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణ(3) తొమ్మిదో వికెట్గా వెనునదిరిగాడు. సామ్ కొన్స్టాస్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వరుస ఫోర్లు కొట్టి బుమ్రా 12 పరుగులతో క్రీజులో ఉండగా.. సిరాజ్ ప్రసిద్ స్థానంలో వచ్చాడు. భారత్ స్కోరు: 168/9 (68.2).సుందర్ ఔట్..టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. 66 ఓవర్లకు భారత్ స్కోర్: 149/8భారత్ ఏడో వికెట్ డౌన్..రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన జడేజా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు.ఆరో వికెట్ కోల్పోయిన భారత్పంత్ స్థానంలోక్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి తొలి బంతికే అవుటయ్యాడు. బోలాండ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా నిష్క్రమించాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 120/6 (57) ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాపంత్(40) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్లో కమిన్స్కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు. నితీశ్ కుమార్ రెడ్డిక్రీజులోకి వచ్చాడు.56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 119/4 (56) .జడ్డూ 14, పంత్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీ బ్రేక్కు భారత్ స్కోర్: 107/4టీ విరామానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్లో 107 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) ఉన్నారు.48 ఓవర్లకు భారత్ స్కోర్: 100/4రవీంద్ర జడేజా(10), రిషబ్ పంత్(26) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 28 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్..విరాట్ కోహ్లి ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు రిషబ్ పంత్(19 నాటౌట్), రవీంద్ర జడేజా(4 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు. 44 ఓవర్లకు భారత్ స్కోర్: 87/4టీమిండియా నాలుగో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో వెబ్స్టర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి(17) ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 76/4నిలకడగా ఆడుతున్న కోహ్లి, పంత్లంచ్ అనంతరం తొలి రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 30 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 67/3. క్రీజులో పంత్(7)తో పాటు విరాట్ కోహ్లి(14) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్.. గిల్ ఔట్శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామానికి ముందు లియోన్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. లంచ్ బ్రేక్కు భారత్ స్కోర్: 57/3నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..శుబ్మన్ గిల్, కోహ్లి నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/2జైశ్వాల్ ఔట్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అద్బుతమైన ఫామ్లో ఉన్న జైశ్వాల్ ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.రాహుల్ ఔట్..కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రాహుల్.. స్టార్క్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్మన్ గిల్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1రోహిత్ ఔట్.. గిల్ ఇన్సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు భారత జట్టు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆఖరి టెస్టులో టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు.రోహిత్తో పాటు గాయం కారణంగా ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. రోహిత్ స్ధానంలో శుబ్మన్ గిల్ తుది జట్టులోకి రాగా.. ఆకాష్ స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఓ మార్పు చేసింది. మిచెల్ మార్ష్ స్ధానంలో వెబ్స్టర్కు చోటు దక్కింది.తుది జట్లుఆస్ట్రేలియా: సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ -
Ind vs Aus: అతడు లేని లోటు సుస్పష్టం.. సిడ్నీలో భారత్ రికార్డు?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్లో ఆఖరిది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆసీస్తో సిరీస్ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.ప్రస్తుత సిరీస్లో పెర్త్లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్బోర్న్లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.అతడు లేని లోటు సుస్పష్టంఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.పుజారాతో కలిసి పంత్ కూడాజట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.కనీసం డ్రా అయినాకెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్మన్ గిల్కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్గా విఫలమవుతున్నాడు. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్రూమ్లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్మన్ గిల్ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్రూమ్లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్కోచ్ గౌతం గంభీర్తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్గా రోహిత్పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్గా.. కెప్టెన్గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్లో గెలిచిన భారత్.. అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సారథిగా, బ్యాటర్గా రోహిత్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్మ్యాన్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు.కానీ తన కెప్టెన్సీ మార్క్ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు రోహిత్ 5 ఇన్నింగ్స్లు ఆడి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్గా అడిలైడ్, మెల్బోర్న్లో రోహిత్ ఘోర ఓటములను చవిచూశాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి సారథ్యంలోని టీమిండియా కివీస్ చేతిలో 3-0 తేడాతో వైట్వాష్కు గురైంది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరుస్తుండండంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి.రోహిత్ శర్మపై వేటు..ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్తో జరగనన్న ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గోన్న భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఇదే ప్రశ్న ఎదురైంది.సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడనున్నాడా? అని ఓవిలేకరి ప్రశ్నించాడు. అందుకుకు బదులుగా" రేపు(శుక్రవారం) ఉయదం పిచ్ చూసిన తర్వాత మా ప్లేయింగ్ ఎలెవన్పై నిర్ణయం తీసుకుంటామని" గంభీర్ సమాధనమిచ్చాడు. కాగా ఐదో టెస్టుకు ముందు రోహిత్ శర్మపై వేటు పడడం దాదాపు ఖాయమైనట్లగా అన్పిస్తోంది.ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పాల్గోకపోవడం, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్లో కూడా రోహిత్ పాల్గోకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్లు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టు పగ్గాలు బుమ్రా చేపట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే శుబ్మన్ గిల్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs AUS: భారత డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్ -
భారత డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గౌతం గంభీర్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 3-1 సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఆసీస్ భావిస్తుంటే.. మరోవైపు సిడ్నీలో ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ను డ్రా చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.అందుకు తగ్గట్టే భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ తమ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. ఈ క్రమంలో భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సిరీస్లో భారత జట్టు ప్రదర్శన పట్ల హెడ్కోచ్ గౌతం గంభీర్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గౌతీ హెచ్చరించినట్లు వినికిడి. ఈ క్రమంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతవారణం వేడెక్కిందని, సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్కు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై గౌతం గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఎటువంటి గొడవలు జరగడం లేదని, అవన్నీ రూమర్సే అని గౌతీ కొట్టి పారేశాడు."డ్రెస్సింగ్ రూమ్లో కోచ్, ఆటగాళ్ల మధ్య చాలా చర్చలు జరుగుతాయి. అవి అక్కడి వరకే పరిమితం కావాలన్నది నా అభిప్రాయం. డ్రెసింగ్ రూమ్ వాతవారణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి విభేదాలు.బయట వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవం. వీటిపై స్పందించాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదన్నది ముఖ్యం. నిజాయతీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నంత వరకుభారత క్రికెట్ సురక్షితంగానే ఉంటుంది.డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్ల ప్రదర్శన, మ్యాచ్లు ఎలా గెలవాలన్న విషయాల గురించే చర్చిస్తాము. విరాట్ కోహ్లితో కూడా ప్రత్యేకంగా ఎటువంటి చర్చలు జరపలేదు. ప్రస్తుతం మా దృష్టింతా సిడ్నీ టెస్టుపైనే ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 5th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్కు గాయం