వచ్చే ఏడాది (2023) జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి విదేశీ స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం), రిలీజ్ (విడుదల), ట్రేడింగ్ (కొనుగోలు), మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు.
ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) హిట్టర్, ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్.. టెస్ట్ క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యత అంటూ లీగ్ నుంచి వైదొలగగా, తాజాగా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (కేకేఆర్), ఆరోన్ ఫించ్ (కేకేఆర్), మిచెల్ స్టార్క్ (2015 వరకు ఆర్సీబీకి ఆడాడు) దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్కు డుమ్మా కొట్టనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరిగే యాషెస్ సిరీస్ కోసం ఫిట్గా ఉండేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్క్ గతేడాదే ఐపీఎల్పై తన అయిష్టతను వ్యక్త పరిచాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 16వ ఎడిషన్ (2023) ట్రేడింగ్లో భాగంగా కేకేఆర్ జట్టు.. రహ్మానుల్లా గుర్భాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లోకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్)లను డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ నుంచి, అలాగే టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తెచ్చుకున్న విషయం తెలిసిందే. కమిన్స్, ఫించ్, సామ్ బిల్లింగ్స్ స్థానాలను వీరు భర్తీ చేసే అవకాశం ఉంది.
కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగనున్న ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితా పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్ 15ను డెడ్లైన్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ముంబై, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్, రీటెయిన్డ్ ప్లేయర్ల లిస్ట్ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది.
చదవండి: స్టార్ ఆల్రౌండర్ను వదులుకున్న ముంబై, జడేజాను అట్టిపెట్టుకున్న చెన్నై..!
చదవండి: T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్ మామకు మరో భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment