బీసీసీఐ సంచలనం.. ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ. 45 లక్షలు | BCCI Announced Test Cricket Incentive Scheme For Team India; Check Details - Sakshi
Sakshi News home page

BCCI: బీసీసీఐ కీలక ప్రకటన.. ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ. 45 లక్షలు

Published Sat, Mar 9 2024 3:47 PM

BCCI Announce Test Cricket Incentive Scheme Check Details - Sakshi

టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యం పెంచేలా బీసీసీఐ నిర్ణయం

టెస్టు క్రికెట్‌ ప్రాధాన్యం పెంచేలా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. టెస్టు క్రికెట్‌ ఇన్సెంటివ్‌ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాడు. పురుషుల సీనియర్‌ జట్టులో భాగమైన క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు.

ఆటగాళ్లను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు.. వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా పేర్కొన్నాడు. 2022-23 సీజన్‌ నుంచి టెస్టు క్రికెట్‌ ఇన్సెంటివ్‌ స్కీమును అమలు చేస్తామని.. టెస్టు క్రికెట్‌ ఆడేవాళ్లకు ఇదొక అదనపు రివార్డు అని ఈ సందర్భంగా వెల్లడించాడు.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 45 లక్షలు
ఒక సీజన్‌లో టీమిండియా షెడ్యూల్‌లో తొమ్మిది టెస్టులు ఉన్నాయనకుంటే.. ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్‌ ఉండవు.

అయితే, 5-6 మ్యాచ్‌లలో భాగమై తుదిజట్టులో ఆడితే 30 లక్షల చొప్పున.. బెంచ్‌కే పరిమితం అయితే 15 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారు. అదే విధంగా.. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లలో భాగమై తుదిజట్టులో ఆడితే రూ. 45 లక్షలు, బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు.

టీమిండియా విజయం తర్వాత
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం తర్వాత జై షా ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. 

బజ్‌బాల్‌ అంటూ ఇంగ్లండ్‌ అలా.. బీసీసీఐ ఇలా
బజ్‌బాల్‌ అంటూ సంప్రదాయ క్రికెట్‌ రూపురేఖల్నే మార్చేలా ఇంగ్లండ్‌ దూకుడైన ఆట తీరుతో ముందుకు సాగుతుంటే.. బీసీసీఐ మాత్రం ఈ ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.

జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు కచ్చితంగా రంజీలో ఆడాలంటూ నిబంధన విధించిన బోర్డు.. ఆదేశాలను ధిక్కరించిన శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్ కిషన్‌ల సెంట్రల్‌ కాంట్రాక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టెస్టు క్రికెట్‌కు తాము పెద్దపీట వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మేరకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది.

చదవండి: IND Vs ENG 5th Test: అందుకే రోహిత్‌ అవుట్‌!.. కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే

 
Advertisement
 
Advertisement