
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, టీమిండియా మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఓపెనర్లైన పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్లను ఇంగ్లండ్కు పంపించాలని భారత సెలక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమిండియా అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ చేశాడని, బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అయితే షా, పడిక్కల్ను కాదని అనూహ్యంగా బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ను స్టాండ్బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
కాగా, ఈ విషయమై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే సెలక్షన్ కమిటీ చైర్మన్ స్పందించేలా ఉన్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి పృథ్వీషా, పడిక్కల్ను ఇంగ్లండ్కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ నుంచి బీసీసీఐకి ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ అందలేదు. మరోవైపు షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26న ఈ సిరీస్ ముగిసాక వీరి ఇంగ్లండ్ పర్యటన అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment