
సచిన్ టెండుల్కర్- విరాట్ కోహ్లి (PC: BCCI)
Asia Cup 2023- ICC ODI WC 2023: పాకిస్తాన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. ప్రతి ఒక్కరూ భారత జట్టు కూర్పుపై తమ అభిప్రాయాలు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని.. వాళ్ల ఉచిత సలహాలు టీమిండియాకు అవసరం లేదని ఘాటుగా విమర్శించాడు.
అదే విధంగా.. తమ అభిమానులకు మెరుగైన ఆటతో సంతృప్తిపరచలేక భారత క్రికెటర్లతో పోల్చుకుంటూ తామే గొప్ప అని చెప్పుకోవడం పాక్ ఆటగాళ్లకు అలవాటైపోయిందని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అలాంటి వాళ్లకు స్థానిక మీడియాలో ఎక్కువ ప్రచారం కల్పించడం సరికాదంటూ హితవు పలికాడు.
టీమిండియా సెలక్షన్పై పెదవి విరుపులు
కాగా ఆసియా కప్, వరల్డ్కప్ ఈవెంట్లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు గురించి ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డేల్లో మెరుగైన రికార్డు లేని సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లను ఎందుకు ఎంపిక చేశారంటూ ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీ తదితరులు విమర్శించారు.
భారత జట్టు భయపడుతోందంటూ
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ వేదిక మార్పుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ నజామ్ సేథీ.. పాకిస్తాన్తో తలపడేందుకు టీమిండియా భయపడుతోందంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన సునిల్ గావస్కర్.. ఇలాంటి వాళ్ల చెత్త సలహాలు మనకు అవసరమా అంటూ విమర్శించాడు.
సునిల్ గావస్కర్
సచిన్ కంటే ఇంజమామ్ గొప్పా? ఏంటిదంతా?
‘‘కొంతమంది బయటి వ్యక్తులు.. ముఖ్యంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా ప్రముఖులు టీమిండియా సెలక్షన్లో దూరిపోవాలని తహతహలాడుతూ ఉంటారు. ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.
మన జట్టు గురించి వాళ్లకు ఆందోళన ఎందుకు? వాళ్లకు అవసరం లేని విషయాల్లో తలదూర్చడం ఏమిటో? కానీ మనం వాళ్లను సహిస్తున్నాం. ఇక.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కంటే బాబర్ ఆజం బెటర్.. షాహిన్ ఆఫ్రిది లాంటి పేసర్ లేడు.. సచిన్ టెండుల్కర్ కంటే ఇంజమామ్ ఉల్ హక్ బెటర్.. ఇలాంటివి తరచుగా మనకు వినిపిస్తూ ఉంటాయి.
అలా చెప్పుకొంటూ పబ్బం గడుపుతూ
వాళ్ల దృష్టిలో తామెల్లప్పుడూ... టీమిండియా క్రికెటర్ల కంటే మెరుగే అనుకుంటారు. అలా చెప్పుకొంటూ తమ అభిమానులను అలరిస్తూ ఉంటారు’’ అని గావస్కర్ చురకలు అంటించాడు. కాగా ఆసియా కప్-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ మధ్య కొలంబోలో ఆదివారం మ్యాచ్ జరుగనుంది.
చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! బుమ్రా వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment