కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్‌ ఠాకూర్‌ | Essex Rope In Shardul Thakur For Upcoming County Season | Sakshi
Sakshi News home page

కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్‌ ఠాకూర్‌

Feb 19 2025 8:32 AM | Updated on Feb 19 2025 8:32 AM

Essex Rope In Shardul Thakur For Upcoming County Season

టీమిండియా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్‌ 2025-26 కౌంటీ సీజన్‌ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్‌తో డీల్‌లో శార్దూల్‌ ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శార్దూల్‌ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్‌ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.

2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్‌.. ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్‌ చివరిగా 2023 బాక్సింగ్‌ డే టెస్ట్‌లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్‌ దేశవాలీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో రాణిస్తుండటంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటుతున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్‌లో శార్దూల్‌ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్‌ ఆర్డర్‌లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై సెమీస్‌కు చేరడంలో శార్దూల్‌ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్‌ విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఓ వికెట్‌ తీసి, 37 పరుగులు చేశాడు.

కష్టాల్లో ముంబై
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్‌ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), శివమ్‌ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్‌ ఆనంద్‌ (67 నాటౌట్‌), తనుశ్‌ కోటియన్‌ (5) ముంబైను గట్టెక్కించే ‍ప్రయత్నం​ చేస్తున్నారు. 

విదర్భ యువ స్పిన్నర్‌ పార్థ్‌ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్‌ షోరే (74), దనిశ్‌ మలేవార్‌ (79), యశ్‌ రాథోడ్‌ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్‌ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement