‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు! | Former IPL Chairman Lalit Modi Cryptic Post To Sunrisers Leeds Viral | Sakshi
Sakshi News home page

‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు!

Mar 18 2026 2:56 PM | Updated on Mar 18 2026 3:31 PM

Former IPL Chairman Lalit Modi Cryptic Post To Sunrisers Leeds Viral

హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడంపై భారత్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

కాగా అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్‌ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు.  అందుకే ఒకసారి నాకు కాల్‌ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన సందేశం మాత్రం సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే తాజాగా భారత్‌లో ఐపీఎల్‌ ప్రారంభమవుతున్న వేళ  అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్‌ మోదీ.. కావ్యామారన్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్‌ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. 

లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి.  2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్‌ ఫిలిప్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement