ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన మాటలతో అగ్గి రాజేసింది.
పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్మన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాము. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం.
క్రికెట్ మినహా అనవసర విషయాల గురించి మాట్లాడదలచుకోలేము. అయినా నేను క్రికెట్ తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ అనేది మా కల. దాని గురించే మాట్లాడుకుంటాం. మీరు హైవోల్టేజ్ మ్యాచ్ అని చెబుతున్న ప్పటికీ నా దృష్టిలో మాత్రం పాకిస్తాన్తో మ్యాచ్ను ఒక సాధారణ గేమ్గానే చూస్తున్నాను.
అయితే పాక్తో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. పాక్ ఒక్కటే కాదు తాము ఆడబోయే ప్రతీ మ్యాచ్లోనూ ఒత్తిడి సహజం. కానీ దానిని జయిస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. ఎవరితో మ్యాచ్ అయినా మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలని అనుకుంటాము.’ అని చెప్పుకొచ్చింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు తలపడితే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. కానీ పహల్గాం ఘటన తర్వాత పాక్తో ఆడే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆసియా కప్ నుంచి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు.
మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హర్మన్ సేన పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. కాబట్టి నేటి మ్యాచ్లోనూ భారత మహిళా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం లేదు. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరింది. 2020 ఎడిషన్లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్తోనే సరిపెట్టుకుంది.
𝘛𝘩𝘦 𝘸𝘰𝘳𝘭𝘥 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘴 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘪𝘥 𝘰𝘯𝘤𝘦…
𝙂𝙧𝙚𝙖𝙩 𝙏𝙚𝙖𝙢𝙨 𝘢𝘳𝘦 𝘳𝘦𝘮𝘦𝘮𝘣𝘦𝘳𝘦𝘥 𝘧𝘰𝘳 𝘸𝘩𝘢𝘵 𝘵𝘩𝘦𝘺 𝘥𝘰 𝘯𝘦𝘹𝘵 🏆⏳
The #WomenInBlue are #T20WorldCup ready 💪 #TeamIndia pic.twitter.com/7fWJN6ootJ— BCCI Women (@BCCIWomen) June 14, 2026


