చరిత్ర సృష్టించిన హర్షిత్‌ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా | Harshit Rana Creates History For India, Becomes First Player To Take 3+ Wickets On Debut In All 3 Formats, Read Story Inside | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్‌ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా

Published Fri, Feb 7 2025 7:30 AM | Last Updated on Fri, Feb 7 2025 10:26 AM

Harshit Rana Creates History For India, Becomes First Player

నాగ్‌పూర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో సకీబ్‌ మహమూద్‌, రషీద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెతల్‌, అర్చర్‌ చెరో వికెట్‌ను సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది.

కెప్టెన్ జోస్‌ బట్లర్‌ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్‌ బెతెల్‌ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్‌ సాల్ట్‌ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్‌(32) దూకుడగా ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు షమీ, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

చరిత్ర సృష్టించిన రాణా..
ఇక ఈ మ్యాచ్‌తో భారత తరపున వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్‌ హర్షిత్‌ రాణా(Harshit Rana) పర్వాలేదన్పించాడు. అయితే తన మొదటి మూడు ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్‌ జట్టు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ డకెట్‌ ఊతికారేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌​ ఐదువ ఓవర్‌ వేసిన రాణా.. ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు.

కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్‌ స్పీడ్‌ స్టార్‌ అద్భుతమైన కమ​్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్లు బెన్‌ డకెట్‌, హ్యారీ బ్రూక్‌లను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్‌గా  ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన రాణా.. 53 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. 

ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. కాగా రాణా తన టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లండ్‌పైనే చేశాడు. 

పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో రాణా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాణా 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే రాణా ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే అరంగేట్రంలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా రాణా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాణా ఒకే ఓవర్‌లో ఏకంగా 26 పరుగులిచ్చాడు.
చదవండి: శుబ్‌మన్, శ్రేయస్‌ సత్తా చాటగా...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement