
అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 286 పరుగులుగా ఉంది. ధృవ్ జురెల్ (Dhruv Jurel) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా 30 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.
డీజే హాఫ్ సెంచరీ
రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ తనకు లభించిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 91 బంతుల్లో డీజే ఈ మార్కును తాకాడు. గ్రీవ్స్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.
రాహుల్ సూపర్ సెంచరీ
ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. టెస్ట్ల్లో రాహుల్కు ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.
గిల్ హాఫ్ సెంచరీ
శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (100 బంతుల్లో 5 ఫోర్లు) పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు. జైస్వాల్ వికెట్ సీల్స్కు, సాయి సుదర్శన్ వికెట్ ఛేజ్కు దక్కాయి.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.