భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి | India scored the most runs in the first over of an ODI innings when they hit 23 runs against Afghanistan | Sakshi
Sakshi News home page

IND vs AFG: భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

Jun 20 2026 7:36 PM | Updated on Jun 20 2026 8:56 PM

India scored the most runs in the first over of an ODI innings when they hit 23 runs against Afghanistan

చెపాక్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి వ‌న్డేలోనూ అఫ్గానిస్తాన్ త‌మ మార్క్ చూపించ‌లేక‌పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవ‌ర్ల‌లో 218 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త పేస‌ర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.

అయితే 36 ప‌రుగులకే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన అఫ్గాన్‌ను కెప్టెన్ హాష్మ‌తుల్లా షాహిది(102) సెంచ‌రీతో ఆదుకున్నాడు. అత‌డితో పాటు ఓమ‌ర్జాయ్‌(50) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

అఫ్గాన్‌కు షాక్‌!
అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంతి ప‌డ‌క ముందే భార‌త్ స్కోర్ బోర్డులో 5 ప‌రుగులు చూసి అంద‌రూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొర‌పాట్ల వ‌ల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజ‌ర్ లైన్‌)లో ప‌దే ప‌దే న‌డిచినందుకు జ‌రిమానా విధించారు.

మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్‌ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్‌లోకి దూసుకెళ్లాడు.

దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్‌లు ఐదు ప‌రుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్‌కు షాకిచ్చారు. నిబంధ‌న‌లో పిచ్ మ‌ధ్య‌లో న‌వ‌డ‌వడం గానీ ప‌రిగెత్త‌డం గానీ చేయ‌కూడ‌దు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.

తొలి ఓవ‌ర్‌లో 23 రన్స్‌
కాగా కాగా భారత ఇన్నింగ్స్‌లో మొదట ఓవర్‌ వేసిన అఫ్గాన్ పేసర్‌ అజ్మతుల్లా ఓమర్జాయ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్‌గా సంధించిన ఓమర్జాయ్‌.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్‌తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.

దీంతో  టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్‌లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్‌లో  ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల‌ భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌పై మొదటి ఓవర్‌లో 22 పరుగులు భారత్‌ సాధించింది. తాజా మ్యాచ్‌తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.
చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement