ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌! నితీశ్‌కు చోటు? | India's Best XI Of Players Not In Champions Trophy 2025 Squad | Sakshi
Sakshi News home page

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌! నితీశ్‌కు చోటు?

Jan 21 2025 6:18 PM | Updated on Jan 21 2025 6:55 PM

India's Best XI Of Players Not In Champions Trophy 2025 Squad

ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ-2025 మ‌రో నెల రోజుల్లో తెరలేవ‌నుంది. ఈ  మెగా ఈవెంట్ పాకిస్తాన్‌, యూఏఈ వేదిక‌ల‌గా ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీ కోసం ఒక్క ఆతిథ్య పాకిస్తాన్ మిన‌హా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు త‌మ జ‌ట్ల వివరాల‌ను వెల్ల‌డించాయి. 

భార‌త క్రికెట్ బోర్డు కూడా ఇటీవ‌లే 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టు ఎంపికపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న మ‌హ్మ‌ద్ సిరాజ్‌, సంజూ శాంస‌న్‌కు చోటు ద‌క్క‌పోవ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రోవైపు విజ‌య్‌హాజారే ట్రోఫీలో దుమ్ములేపిన క‌రుణ్ నాయ‌ర్‌ను కూడా ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబడుతున్నారు.

ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఆట‌గాళ్ల‌తో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఓ స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ త‌యారు చేశాడు. ఆ జట్టులో ఓపెన‌ర్లగా రుతురాజ్ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌ల‌కు చోటు ద‌క్కింది. రుతురాజ్ గైక్వాడ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు భార‌త్ త‌ర‌పున 6 వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మాత్రం రుతురాజ్‌కు మంచి రికార్డు ఉంది.

మ‌రోవైపు సాయిసుద‌ర్శ‌న్ గ‌త ఏడాది భార‌త్ త‌ర‌పున వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూలోనే హాఫ్ సెంచ‌రీతో సుద‌ర్శ‌న్ మెరిశాడు. ఆ త‌ర్వాత జ‌ట్టులో అత‌డు చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ఇక మిడిలార్డ‌ర్‌లో ఇషాన్ కిష‌న్‌కు చోటు ఇచ్చాడు. బోర్డు ఆదేశాల‌ను ధిక్క‌రించ‌డంతో జ‌ట్టులో కిష‌న్ చోటు కోల్పోయాడు. అయితే దేశ‌వాళీ క్రికెట్‌లో మాత్రం ఈ జార్ఖండ్ ఆట‌గాడు అద్బుతంగా రాణిస్తున్నాడు.

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023 భార‌త జ‌ట్టులో కూడా కిష‌న్ భాగంగా ఉన్నాడు. ఇక ఈ జ‌ట్టులో మిడిలార్డ‌ర్‌లో కిష‌న్‌తో పాటు సంజూ శాంస‌న్‌, తిల‌క్ వ‌ర్మ‌కు కూడా స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ చోటు ఇచ్చాడు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా ఈ జ‌ట్టులో రియాన్ ప‌రాగ్‌కు ఫినిష‌ర్‌గా చోటు ల‌భించింది.

ఇక ఆల్‌రౌండ్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. నితీశ్‌ ఇప్పటికే భారత్‌ తరపున టీ20, టెస్టుల్లో తన మార్క్‌ చూపించాడు. బౌలర్లగా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కింది. ఇక జట్టుకు సంజూ శాంసన్‌​ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా ఈ జట్టులో కూడా కరుణ్‌ నాయర్‌కు ప్లేస్‌ లేకపోవడం గమనార్హం.

చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక కాని ఆటగాళ్లతో బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), సంజు శాంసన్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి
చదవండి: IND vs ENG: భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర వీరులకు చోటు

Advertisement
 
Advertisement
Advertisement