
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పాత జట్టులోని కొందరు సభ్యులతో ఓ పాడ్కాస్ట్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్, దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితర ఆటగాళ్లు పాల్గొని జట్టుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. లీగ్ తొలి సీజన్లో(2008) జట్టుకు ఎంపికైన నాటి భావోద్వేగ క్షణాలను గుర్తు చేసున్నాడు. ఐపీఎల్ తొలి వేలం జరిగే సమయానికి తాను అండర్-19 ప్రపంచకప్ కోసం మలేషియాలో ఉన్నానని, నా కోసం బెంగళూరుతో పాటు ఢిల్లీ ఫ్రాంచైజీ పోటీ పడిన విషయాన్ని ఇప్పటికీ మరవలేకపోతున్నానని భావోద్వేగానికి లోనయ్యాడు. నాడు వేలంలో బెంగళూరు జట్టు తనను దాదాపుగా రూ. 25 లక్షలకు(30000 డాలర్లు) సొంతం చేసుకుందని, ఆర్సీబీ తన కోసం అంత భారీ మొత్తం వెచ్చిస్తుందని అస్సలు ఊహించలేదని, ఆ సమయంలో అంత డబ్బును ఊహించుకుని చాలా క్రేజీగా ఫీలయ్యానని గుర్తు చేసున్నాడు.
అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేసిన రోజు తనకింకా గుర్తుందని, టీమిండియాకు ఆడితే కలిగే ఆర్ధిక ప్రయోజనాల గురించి తనకు అప్పుడే తెలిసిందని తెలిపాడు. నాడు తన కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సైతం పోటీపడినప్పటికీ.. వారికి బౌలర్ల అవసరత ఉండడంతో ప్రదీప్ సాంగ్వాన్ వైపు మొగ్గు చూపారని గుర్తు చేసుకున్నాడు. కాగా, విరాట్ కోహ్లి.. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ మినహా మరే ఇతర జట్టుకు ప్రాతనిధ్యం వహించలేదు. 2008 నుంచి 2012 దాకా ఆర్సీబీలో సాధారణ ఆటగాడిలా కొనసాగిన కోహ్లి.. 2013 నుంచి 2021 సీజన్ వరకు సారధిగా వ్యవహరించాడు. ఆ సీజన్ తర్వాత కెప్టెన్సీని వదులుకున్న కోహ్లిని.. ఆర్సీబీ 15వ ఎడిషన్ కోసం 15 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకుంది.
చదవండి: IPL Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధావన్, వార్నర్ భాయ్.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment