
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్ చివరి అంకానికి చేరింది. నిన్న (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్-2తో ఫైనల్స్ రెండో బెర్త్ దక్కించుకున్న జట్టేదో తేలిపోయింది. ముంబై ఇండియన్స్ను మట్టికరిపించి పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత (2014 తర్వాత) ఫైనల్స్కు చేరింది.
మరోవైపు ఆర్సీబీ క్వాలిఫయర్-1లో విజయంతో (పంజాబ్పై) నేరుగా ఫైనల్స్కు (తొమ్మిదేళ్ల తర్వాత) చేరింది. ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్స్ (2009, 2011, 2016, 2025) అవుతుంది. పంజాబ్, ఆర్సీబీ జట్లకు ఇప్పటివరకు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ సీజన్లో ఏ జట్టు టైటిల్ గెలిచినా ఐపీఎల్కు కొత్త ఛాంపియన్ వస్తుంది.
ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్స్కు చేరిన నేపథ్యంలో ఓ విషయం గురించి తెలుసుకునేందుకు ఆర్సీబీ అభిమానులు తెగ ఆసక్తి చూపుతున్నారు. గత మూడు ఫైనల్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎలా ఆడాడన్నదే వారి ఆతృత.
2009 సీజన్లో ఆర్సీబీ తొలి ఫైనల్స్ ఆడగా.. అందులో అప్పటి నవయువకుడు విరాట్ 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఆండ్రూ సైమండ్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలై తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.
ఆర్సీబీ రెండో సారి ఫైనల్స్కు చేరింది 2011 సీజన్లో. ఆ సీజన్ ఫైనల్లో ఆర్సీబీ నాటి డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడింది. ఆ మ్యాచ్లో విరాట్ 32 బంతుల్లో 35 పరుగులు చేసి సురేశ్ రైనా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని రెండోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.
ఆర్సీబీ మూడో సారి ఫైనల్కు చేరింది 2016 సీజన్లో. ఆ సీజన్లో విరాట్ అరివీర భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. ఆ సీజన్లో 900 పరుగుల క్లబ్లో చేరిన విరాట్.. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఫైనల్లో మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో) చెలరేగాడు. అయినా ఆ మ్యాచ్లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని మూడోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది.
ఆ మ్యాచ్లో విరాట్, గేల్ (76) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. తాజాగా ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్కు చేరింది. మరి ఈ సీజన్లో విరాట్ ఎన్ని పరుగులు సాధిస్తాడో, ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసుకుంటుందో లేదో చూడాలి.