ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్‌.. అంతా రోహిత్‌ వల్లే? | J&K spoil Rohit Sharmas Ranji comeback, beat Mumbai after 10 years, move top of table | Sakshi
Sakshi News home page

ముంబైను చిత్తు చేసిన జమ్మూ కాశ్మీర్‌.. అంతా రోహిత్‌ వల్లే?

Jan 25 2025 3:57 PM | Updated on Jan 25 2025 4:19 PM

J&K spoil Rohit Sharmas Ranji comeback, beat Mumbai after 10 years, move top of table

రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై జ‌ట్టుకు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. శరద్‌ పవార్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ముంబై జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్‌ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కాశ్మీర్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

జమ్మూ బ్యాటర్లలో ఓపెనర్‌ శుభమ్ ఖజురియా(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వివ్రంత్‌ శర్మ(38), అబిద్‌ ముస్తాక్‌(32 నాటౌట్‌) రాణించారు. ముంబై బౌలర్లలో షామ్స్‌ ములానీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.  ప్రస్తుత సీజన్‌లో జమ్మూకు ఇది నాలుగో విజయం కావడం గమనార్హం.

కాగా అంతకుముందు 274/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో శార్ధూల్ ఠాకూర్(119) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. తనీష్‌ కొటియన్‌(62) రాణిండు. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు.  కాగా జమ్మూ కాశ్మీర్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.

నిరాశపరిచిన రోహిత్‌ శర్మ..
ఇక పదేళ్ల తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్‌ ఆడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన రోహిత్‌.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అతడితో పాటు యశస్వి జైశ్వాల్‌, అజిం‍క్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌ సైతం తమ మార్క్‌ను చూపించలేకపోయారు. కాగా రోహిత్‌ వల్లే ముంబై ఓటమి పాలైందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. రోహిత్‌​ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయూష్‌ మాత్రేను పక్కన పెట్టి ముంబై సెలక్టర్లు తప్పు చేశారని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

17 అయూష్‌ మాత్రం ప్రస్తుత సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. అటువంటి ఆటగాడిని ఎలా పక్కన పెడతారని ముంబై జట్టు మెనెజ్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
చదవండి: Punjab Vs Karnataka: శతకంతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌.. కానీ..

Advertisement
 
Advertisement
Advertisement