ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా.
అయితే ఈ సీజన్లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్) కామెంట్రీ బాక్స్లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు.
బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్లో సెమీస్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్లో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్కల్లమ్ కోచ్గా వచ్చిన కొత్తలో బజ్బాల్ ఆటతో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించింది.
కానీ క్రమంగా బజ్బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్కల్లమ్ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్కు కోచ్గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.
చదవండి: రోహిత్ బాటలో రిషబ్ పంత్!


