
Team India Test Captain: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. 36 ఏళ్ల రోహిత్ను తప్పించి.. శుభ్మన్ గిల్ లేదంటే శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చాయి.
మరోవైపు.. ఇప్పుడిపుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న గిల్ వంటి ఆటగాళ్లపై భారం మోపే బదులు.. మాజీ సారథి విరాట్ కోహ్లినే మరోసారి కెప్టెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది.
కోహ్లి అంతటి సమర్థుడే..
యూబ్యూబ్ చానెల్ వేదికగా.. అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా.. కోహ్లి తిరిగి టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఓ నెటిజన్ అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు.
తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
తనకు తానుగా తప్పుకొన్నాడు!
కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లిని.. అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్గా తప్పించారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాలో టీమిండియా 2021-22 పర్యటన సమయంలో టెస్టులో ఓటమి తర్వాత కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఈ క్రమంలో అప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ టెస్టు జట్టు నాయకుడయ్యాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది.
తొట్టతొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో. 2021-23 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి.. రెండు సందర్భాల్లోనూ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. జూలై 12- ఆగష్టు 13 వరకు కరేబియన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపనుంది.
చదవండి: జాక్పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment