
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్గా జడేజా నిలిచాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బెయిర్ స్టోను ఔట్ చేసిన జడ్డూ.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 332 మ్యాచ్లు ఆడి 552 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ను జడేజా అధిగమించాడు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో 551 వికెట్లు సాధించాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో కొనసాగుతున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పోప్ (148), రెహాన్ అహ్మద్ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్లో 126 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment