పంత్‌ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు | Rishabh Pant Takes Virat Kohlis Revenge With A Step Out First-Ball Six | Sakshi
Sakshi News home page

IND vs AUS: పంత్‌ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Jan 4 2025 12:09 PM | Updated on Jan 4 2025 12:33 PM

Rishabh Pant Takes Virat Kohlis Revenge With A Step Out First-Ball Six

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(Rishabh Pant) తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అప్పటివరకు నిప్పులు చెరిగిన ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్ల దూకుడుకు పంత్‌ కళ్లేం వేశాడు.

తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన పంత్‌.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానుల అలరించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే ఈ ఢిల్లీ డైనమెట్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 33 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా భారత టెస్టు క్రికెట్‌ హిస్టరీలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఈ జాబితాలో రిషబ్‌నే తొలి స్ధానంలో ఉన్నాడు.  2022లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పంత్‌ కేవలం 28 బంతుల్లో ఆ‍ర్ధ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగిన పంత్‌.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

తొలి ప్లేయర్‌గా రికార్డు..
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన పర్యాటక బ్యాటర్‌గా రిషబ్‌ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ దిగ్గజం, వెస్టిండీస్‌  మాజీ క్రికెటర్‌ రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఆస్ట్రేలియాలో 33 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజాల ఆల్‌టైమ్‌ రికార్డును పంత్‌ బ్రేక్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత్‌ ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement