Ind vs SL: నిర్ణయం మార్చుకున్న రోహిత్‌!.. మరి కోహ్లి? | Rohit Could Cut Short Vacation To Play ODIs vs Sri Lanka, But Kohli: Report | Sakshi
Sakshi News home page

Ind vs SL: నిర్ణయం మార్చుకున్న రోహిత్‌!.. మరి కోహ్లి?

Published Wed, Jul 17 2024 3:48 PM | Last Updated on Wed, Jul 17 2024 4:09 PM

Rohit Could Cut Short Vacation To Play ODIs vs Sri Lanka, But Kohli: Report

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు టీమిండియా కేవలం రెండు వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ సన్నాహకాల్లో భాగంగా తొలుత శ్రీలంక.. తర్వాత ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొననుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌కు ఈ రెండు సిరీస్‌లు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఈ వన్డే టోర్నీలో ఆడాలనుకునే సీనియర్లు తప్పకుండా లంక, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లో పాల్గొనాలని అతడు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

అందుబాటులో ఉండాలి
ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో చర్చించిన గంభీర్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కీలక బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కచ్చితంగా ఈ రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది. కోహ్లి, బుమ్రా మాత్రం శ్రీలంకతో వన్డే సిరీస్‌ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ ముగిసిన అనంతరం రోహిత్‌, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు.

లండన్‌లో కోహ్లి.. అమెరికాలో రోహిత్‌
స్వదేశానికి తిరిగి వచ్చిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కోహ్లి లండన్‌కు వెళ్లగా.. రోహిత్‌ శర్మ అమెరికాకు పయనమయ్యాడు. మరోవైపు.. బుమ్రా కూడా సెలవు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో విశ్రాంతి పేరిట ఈ ముగ్గురు శ్రీలంక సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్‌ మాత్రం లంకతో వన్డే సిరీస్‌ ఆడాల్సిందేనని పట్టుబట్టడంతో రోహిత్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి.

లేదంటే కెప్టెన్‌ అతడే!
ఫలితంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఒకవేళ అతడు గనుక సమయానికి అందుబాటులోకి రాకపోతే కేఎల్‌ రాహుల్‌ భారత జట్టును ముందుకు నడిపించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లగా శుబ్‌మన్‌ గిల్‌ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో యువ భారత జట్టు 4-1తో టీ20 సిరీస్‌ గెలిచింది. తదుపరి టీమిండియా జూలై 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది.

చదవండి: NZ vs Pak: షెడ్యూల్‌ విడుదల.. ఐపీఎల్‌-2025కి కివీస్‌ స్టార్స్‌ దూరం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement