Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 30 పరుగులతో ఓడించి రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మ్యాచ్ విజయం అనంతరం రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ జోఫ్రా ఆర్చర్పై ప్రశంసలు కురిపించాడు. తమ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో జోఫ్రా ఆర్చర్దే కీలకపాత్ర అని, అతడు ఆడకపోయుంటే ఇవాళ ఇంటికి వెళ్లిపోయేవాళ్లమని పరాగ్ పేర్కొన్నాడు.
రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘మేము అనుకున్న ప్రణాళికలు సఫలం కావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్చరు నంబర్ 7 స్థానంలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రీజులో ఎవరో ఒకరు చొరవ తీసుకుని వేగంగా ఆడాల్సిన పిచ్ ఇది.
ఆ బాధ్యతను ఆర్చర్ చక్కగా నిర్వర్తించాడు. ఈ సీజన్లో నేను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పుడు, అతడిని అవుట్ చేయగల సత్తా ఒక్క జోఫ్రా ఆర్చర్కే ఉందని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆర్చర్ నిలబెట్టుకున్నాడు. అతడు బండరాయిలా దృఢంగా నిలబడి మ్యాచ్ను మా వైపు తిప్పాడు’ అని కొనియాడాడు.
ఇక మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆర్చర్ @ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని నేను అనుకోవడం లేదు, దీనికంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడానికే ప్రయత్నించాను.
నేను ఇంత త్వరగా బ్యాటింగ్కు రావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంపాక్ట్ సబ్ నిబంధన వల్ల నాకు సాధారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. కోచ్ నన్ను ప్యాడ్లు కట్టుకోమన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ, నేను నన్ను ఒక ఆల్రౌండర్గానే భావిస్తాను. ప్రస్తుతం నా ఫిట్నెస్ చాలా బాగుంది’ అని సంతోషం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితమైంది. ముంబైపై విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్, కేకేఆర్లు కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి.


