ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బౌలర్, తెలుగుతేజం శ్రీ చరణి సంచలనం సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి 759 పాయింట్లతో ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్లో కేవలం ఐదు మ్యాచ్ల్లోనే 14 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రీ చరణి నిలిచింది.
అంతేకాదు ఐసీసీ ప్రకటించిన 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్గా శ్రీ చరణి నిలిచింది. శ్రీ చరణి తర్వాత సోఫి ఎకెల్స్టోన్ (ఇంగ్లండ్, 723 పాయింట్లు), చార్లీడీన్ (ఇంగ్లండ్, 722 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ 8వ స్థానంలో కొనసాగుతోంది.
బ్యాటింగ్ విభాగానికొస్తే.. టాప్-10లో ముగ్గురు భారతీయ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (746 పాయింట్లు) ఐదో స్థానంలో కొనసాగుతుండగా, షెఫాలీ వర్మ (717 పాయింట్లు) ఆరో స్థానంలో, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (677 పాయిట్లు) పదో స్థానంలో కొనసాగుతోంది.
మహిళల టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మరోసారి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. టీ20ల్లో ఈ ఫీట్ సాధించడం బెత్ మూనీకి ఇది ఐదోసారి. ప్రపంచకప్ ఫైనల్లో 64 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన బెత్ మూనీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కొల్లగొట్టింది.
ఇక ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన ఆస్ట్రేలియా ఏడోసారి చాంపియన్స్గా నిలిచింది. ఆల్రౌండర్ల విభాగంలో విండీస్ క్రికెటర్ హేలీ మాథ్యూస్ నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, అమేలి కెర్ (న్యూజిలాండ్), చమేరి ఆటపట్టు (శ్రీలంక) రెండు,మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి దీప్తి శర్మ 5వ స్థానంలో కొనసాగుతోంది.


