అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు.
తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.
ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు.


