Photo Credit: Twitter
కొలంబో వేదికగా ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే జోరు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్లు రాణించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది.
అయితే గిల్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు సాధించిన గిల్ తిరిగి ట్రాక్ ఎక్కేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే కెప్టెన్గా గిల్ 10 టెస్టుల్లో 1100 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్గా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్గా విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ను గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం.
ఇటీవలే స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను గిల్ సారథ్యంలోనే టీమిండియా నెగ్గింది. ఇక జైస్వాల్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత 8 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. ఆ ఒక్కటి కూడా గతేడాది న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్పై సాధించాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రాహుల్తో సమన్వయలోపంతో రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు
తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు.
గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు.
ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు.
Read: లైవ్ మ్యాచ్.. ప్రత్యర్థి గూబ గుయ్మనిపించిన మెస్సీ!


