
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను గిల్కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు గెలవడం ద్వారా గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డును గిల్ ఒకే ఏడాది రెండుసార్లు సాధించడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు దక్కుతుంది. బాబర్ ఇప్పటివరకు ఈ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు.
బాబర్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండ్రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 2021 జులైలొ తొలిసారి, ఈ ఏడాది మార్చిలో రెండోసారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
భారత్ నుంచి ఈ అవార్డును రిషబ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి ఒక్కోసారి గెలుచుకున్నారు. 2021 జనవరి నుంచి ఐసీసీ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులను తొలి మూడు నెలలు (పంత్, అశ్విన్, భువీ) భారత ఆటగాళ్లే దక్కించుకోవడం విశేషం.
ఇదిలా ఉంటే, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్లోనూ టీమిండియా హవా కొనసాగింది. తాజా ర్యాంకింగ్స్లో భారత్ అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వరల్డ్కప్లో హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మెరుగైన రేటింగ్ పాయింట్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment