Photo Credit: Twitter
టీ20 క్రికెట్ వచ్చాకా ఆటలో వేగం పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు నమోదు చేస్తున్న బ్యాటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెంచరీ భారత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ నుంచి వచ్చింది. రెండు వరుస ఐపీఎల్ సీజన్లలో తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రికార్డును వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు.
2025 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 37 బంతుల్లో శతకం సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన వైభవ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు వైభవ్ను ఆకాశానికెత్తుతున్నాం కానీ 95 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లో ఆసీస్ దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్మన్ కేవలం మూడు ఓవర్లలోనే సెంచరీ మార్క్ సాధించడం విశేషం. 1931 నవంబర్ 2న బ్లాక్హెత్ తరఫున బ్రాడ్మన్ న్యూ సౌత్వేల్స్ వేదికగా లిత్గో పొటరీస్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు.
అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటేంటే అప్పట్లో ఒక ఓవర్కు ఆరు బంతులకు బదులు 8 బంతులుండేవి. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లో 33 పరుగులు (8 బంతులు), రెండో ఓవర్లో 40 పరుగులు (8 బంతులు), మూడో ఓవర్లో 27 పరుగులు (ఆరు బంతులు).. మొత్తంగా 22 బంతులెదుర్కొని కేవలం 18 నిమిషాల్లోనే బ్రాడ్మన్ 100 పరుగుల మార్క్ను చేరుకోవడం విశేషం. ఇక ఆ మ్యాచ్లో ఓవరాల్గా బ్రాడ్మన్ 256 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు ఉన్నాయి.
అప్పటికే సూపర్ ఫామ్లో ఉన్న బ్రాడ్మన్కు ఈ రికార్డు పెద్ద లెక్క కాదు. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రాడ్మన్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టుల్లో బ్రాడ్మన్ సగటు 99.94. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. మొత్తంగా బ్రాడ్మన్ 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు, రికార్డు స్థాయిలో 12 డబుల్ సెంచరీలున్నాయి. తన కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్లో ఒక్క పరుగు చేసి ఉన్నా బ్రాడ్మన్ సగటు వందగా ఉండేది. కానీ తన చివరి మ్యాచ్లో బ్రాడ్మన్ డకౌట్ అయ్యాడు.


