
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బౌలర్లు సఫారీల బ్యాటర్ల భరతం పట్టగా.. అనంతరం బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు.
కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహర్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56 బంతుల్లో 51 నటౌట్), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50 పరుగులు నటౌట్) రాణించారు.
మరోసారి అదరగొట్టిన సూర్య..
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి అదరగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆరంభంలో భారత్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరగగా.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడు పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. తన ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్లో కేవలం 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50 పరుగులు సాధించాడు. అఖరి వరకు క్రీజులో నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రిజ్వాన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య
ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ముంబైకర్ మొత్తం 45 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది.
2021 ఏడాదిలో రిజ్వాన్ 42 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తాజా మ్యాచ్తో రిజ్వాన్ను రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా స్కై నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతడు 732 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 2018 ఏడాదిలో ధావన్ 689 పరుగులు చేశాడు.
చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ
Comments
Please login to add a commentAdd a comment