
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం అనంతరం పొట్టి క్రికెట్కు కోహ్లి విడ్కోలు పలికాడు. ఈ మెగా టోర్నీ మొత్తం పేలవ ఫామ్ కనబరిచి విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. కీలకమైన ఫైనల్లో మాత్రం సత్తాచాటాడు.
టాపార్డర్ విఫలమైన చోట కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్ మ్యాచ్లో 76 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. దక్షిణాఫ్రికాకు ముందు మెరుగైన స్కోర్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలర్లు సంచలన ప్రదర్శన చేయడంతో భారత్ రెండోసారి టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్గా అవతరించింది.
ఇక ఫైనల్ మ్యాచ్లో తన ప్రదర్శనగాను కింగ్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో కోహ్లికి మించిన క్రికెటర్ మరొకడు లేడని షెహజాద్ అభిప్రాయపడ్డాడు.
"విరాట్ కోహ్లి ఒక లెజెండ్. మా తరంలో అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు. విరాట్ తన టీ20 కెరీర్ను ఘనంగా ముగించాడు. తన కెరీరంతటా కోహ్లి అద్బుతంగా ఆడాడు. ఆఖరికి చివరి మ్యాచ్లో కూడా కోహ్లి అదరగొట్టాడు.
అది విరాట్ కోహ్లి బ్రాండ్. ఫైనల్లో తన సహచర ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కడితే.. విరాట్ మాత్రం బౌండరీల వర్షం కురిపించాడు. అందుకే విరాట్ను మించిన వాడు లేడని నేను పదేపదే చెబుతున్నాను.
విరాట్ను గతంలో చాలా మంది బాబర్ ఆజంతో పోల్చారు. కానీ అది సరికాదు. విరాట్కు ఎవరూ సాటిరారు. కోహ్లి ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ , యావరేజ్ కలిగి ఉన్నాడు. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్క విరాట్ కోహ్లి ఉంటాడని" ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment