సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. టీ20 క్రికెట్కు బాగా అలవాటు పడిన విండీస్ ఆటగాళ్లు వన్డేలు ఆడడం మరిచిపోయినట్లుగా కనిపిస్తున్నారు. వచ్చిందే తడవు భారీ ఇన్నింగ్స్లతో అలరించాలన్న మోజులో వన్డే ఫార్మాట్లో నిలకడగా ఆడితేనే పరుగులు వస్తాయన్న విషయాన్ని విండీస్ పూర్తిగా పక్కనబెట్టేసింది. తొలి వన్డే తర్వాత ఆడిన రెండు వన్డేల్లోనూ వెస్టిండీస్ 150 పరుగుల్లోపే ఆలౌట్ కావడం గమనార్హం.
తాజాగా గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ మరోసారి బౌలింగ్లో చెలరేగిన వేళ ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో కివీస్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో కీసి కార్టి (48) టాప్ స్కోరర్గా నిలవగా, హెట్మైర్ (26) పర్వాలేదనిపించాడు. జేడన్ లెనోక్స్ 4 వికెట్లతో చెలరేగగా, మైకెల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 141 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 39.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
డారిల్ మిచెల్ (28), హెన్రీ నికోల్స్ (24) ఆరంభంలో మెరుగ్గా ఆడారు. చివర్లో టామ్ లాథమ్ (31 నాటౌట్), డీన్ ఫాక్స్క్రాప్ట్ (22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. వెస్టిండీస్ బౌలర్లలో విటెల్ లాస్ 3 వికెట్లు తీయగా, కేరీ పియర్రీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే జూలై 19న (ఆదివారం) బ్రిడ్జ్టౌన్ వేదికగా జరగనుంది.
చదవండి: అక్షర్ పటేల్ అరుదైన ఫీట్.. ఆ ఇద్దరి సరసన చోటు


