Will India Win T20 World Cup 2022 under Rohit Sharma's Captaincy?

T20 WC 2022: టీమిండియాదే వరల్డ్‌కప్‌.. రోహిత్‌ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే..!

Nov 7 2022 3:31 PM | Updated on Nov 7 2022 4:03 PM

Will Team India Win T20 WC 2022, As Rohit Sharma Won All His First Series As Captain - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో వరుస విజయాలు సాధిస్తూ, గ్రూప్‌-2లో తొలి స్థానంతో సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనైనా జగజ్జేతగా నిలుస్తుందని వంద కోట్లకుపైగా ఉన్న భారతీయ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఫ్యాన్స్‌ ధీమాకు భారత ఆటగాళ్ల ప్రదర్శన ఒక కారణమైతే.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు కలిసివస్తున్న సెంటిమెంట్‌ మరో కారణం.

రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు అన్ని ఫార్మాట్లలో తొలి టోర్నీ లేదా సిరీస్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. తొలి ఐపీఎల్‌, తొలి ఛాంపియన్స్‌ లీగ్‌, తొలి వన్డే, టీ20 సిరీస్‌, తొలి ముక్కోణపు సిరీస్‌, తొలి టెస్ట్‌ సిరీస్‌, తొలి ఆసియా కప్‌.. ఇలా కెప్టెన్‌గా తన అరంగేట్రం సిరీస్‌లన్నింటిలో హిట్‌మ్యాన్‌ భారత్‌ను విజేతగా నిలిపాడు.

ఇప్పుడు అదే సెంటిమెంట్‌ మరోసారి తప్పకుండా రిపీట్‌ అవుతుందని భారత అభిమానులు వంద శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు ఇదే తొలి టీ20 వరల్డ్‌కప్‌ కావడంతో ఈ మెగా టోర్నీలోనూ టీమిండియా గెలవడం పక్కా అంటూ గుడ్డిగా నమ్ముతున్నారు. టీమిండియాదే వరల్డ్‌కప్‌.. రోహిత్‌ శర్మ సాధ్యం చేస్తాడు.. అలా జరుగుతుందంతే అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ సెంటిమెంట్‌కు తోడు మరో యాదృచ్చిక విషయం టీమిండియా ఫ్యాన్స్‌ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచినప్పటి సమీకరణలు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంచుమించు అలాగే రిపీటవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి, సెమీస్‌ రేసు నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమణ, సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ వంటి సమీకరణలు చోటు చేసుకోగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అచ్చం అలాంటి సమీకరణలే మరోసారి రిపీటయ్యాయి.

గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి, సెమీస్‌ రేసు నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమణ, సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ జట్లు చేరాయి. యాదృచ్చికంగా కుదిరిన ఈ సమీకరణల గురించి తెలిసి భారతీయ అభిమానులు ఇప్పటి నుంచే గెలుపు సంబురాల్లో మునిగితేలుతున్నారు. అన్నీ కలిసొస్తున్నాయి.. ఇక మనల్నెవడ్రా అపేది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ ఫోర్‌ జట్లు ఏవన్నది నిన్ననే తేలిపోయింది. గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. నవంబర్‌ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్‌ 13న ఫైనల్‌ జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement