
India's decision-making ahead of the WC 2023 Big Worry Is: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి టీమిండియా సన్నద్ధత సరిగా లేదంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. మెగా ఈవెంట్కు ముందు అనవసర ప్రయోగాలతో సమయం వృథా చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అత్యుత్తమ తుదిజట్టు కూర్పు.. ముఖ్యంగా టాపార్డర్ విషయంలో తడబాటుకు లోనుకావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు.
పిచ్చి ప్రయోగాలతో భారీ మూల్యం
కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్కు ముందు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో మరో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, విండీస్లో పిచ్చి ప్రయోగాలకు పోయి టీమిండియా భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే.
తొలి వన్డే లోస్కోరింగ్ మ్యాచ్లో ఎలాగోలా గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి.. వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించని విండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆగష్టు 1 నాటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గనుక తేడా జరిగితే.. ఘోర పరాభవం తప్పదు.
టీ20 వరల్డ్కప్ మాదిరే జరగదు కదా!
ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 వరల్డ్కప్-2022లో భారత జట్టు కుప్పకూలిన విధానం గుర్తుకువస్తోంది. మళ్లీ అదే పునరావృతం కాబోతోందా అన్న సందేహం నన్ను ఆందోళనకు గురి చేస్తోంది’’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో సెమీస్లోనే రోహిత్ సేన ఇంటిబాట పట్టిన తీరును ప్రస్తావించాడు.
రోహిత్ను డ్రాప్ చేస్తే.. మరి కోహ్లి?
ఇక.. బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు సరికావన్న ఆకాశ్ చోప్రా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదిరే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు.
ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యకర విషయం మరొకటి ఉండదు. కిషన్- శుబ్మన్ గిల్తో ఓపెనింగ్ చేస్తే రోహిత్ను మిడిలార్డర్కు డ్రాప్ చేస్తారా? ఇలాంటి నిర్ణయాలతో నేనైతే అస్సలు ఏకీభవించను.
అలా జరగడానికి వీల్లేదు
ఒకవేళ ఇదే జరిగితే.. విరాట్ కోహ్లిని నంబర్ 3 నుంచి తప్పించి తనను కూడా మిడిలార్డర్కు పంపించాల్సి వసుంది. ఇది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు’’ అని ఆకాశ్ చోప్రా.. మేనేజ్మెంట్ తీరును ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
గిల్- కిషాన్లతో లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇషాన్ను నాలుగో స్థానంలో ఆడించాలనుకున్నా.. అతడి నంబర్ 4 గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్నాయంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment