
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో మానవ్ ఠక్కర్ 6–11, 8–11, 8–11తో అలెక్సిస్ చేతిలో... రెండో మ్యాచ్లో సత్యన్ 4–11, 2–11, 6–11తో ఫెలిక్స్ లెబ్రున్ చేతిలో... మూడో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 13–11, 11–13, 11–7, 8–11, 7–11తో జులెస్ రొలాండ్ చేతిలో ఓడిపోయారు.
లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక జర్మనీ, ఫ్రాన్స్, భారత్ ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం మొత్తం ఏడు గ్రూప్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లకు మిగతా రెండు బెర్త్లు లభిస్తాయి.
ముఖాముఖి ఫలితాల ఆధారంగా గ్రూప్– 2 నుంచి జర్మనీ, ఫ్రాన్స్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత పొందాయి. మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో చైనాతో భారత పురుషుల జట్టు... చైనీస్ తైపీతో భారత మహిళల జట్టు తలపడతాయి.
చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..!
Comments
Please login to add a commentAdd a comment