రోహిత్‌ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్‌ | YASHASVI JAISWAL BECOMES THE LEADING RUN GETTER IN INTERNATIONAL CRICKET IN 2024 | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్‌

Published Wed, Jul 10 2024 6:30 PM | Last Updated on Wed, Jul 10 2024 6:50 PM

YASHASVI JAISWAL BECOMES THE LEADING RUN GETTER IN INTERNATIONAL CRICKET IN 2024

జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్‌ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్‌రేట్‌తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం​ జద్రాన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌) ఉన్నాడు. 

జద్రాన్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్‌రేట్‌తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్‌ రన్‌ స్కోరర్‌గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్‌ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్‌ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 833 పరుగులు చేశాడు.

జింబాబ్వే, భారత్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌ సత్తా చాటడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్‌ (12), రింకూ సింగ్‌ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్‌ గిల్‌ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్‌ భారత్‌ గెలిచిన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement