భారత్లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది.
ఈ విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను భారత్లో జీ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది.
రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్లో మ్యాచ్ల ప్రసార హక్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియన్ డాలర్లను ఆశించింది. కానీ జీ నెట్వర్క్ మంచి ధరకే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2022 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు భారత్లో ప్రసార హక్కులను అప్పట్లో వయాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది పక్కనబెడితే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను భారత్లో వీక్షించాలనుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను జీ నెట్వర్క్ ఇటీవలే కొత్తగా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి (ఇంగ్లీష్) లో మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
భారతీయ బ్రాడ్కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి.
ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.


